నినాదాలు చేస్తున్న కార్మికులు, నాయకులు
మున్సిపల్ కార్మికుల పోరాటానికి డివైఎఫ్ఐ మద్దతు
ప్రజాశక్తి-నెల్లూరు :నగరపాలక సంస్థలో మున్సిపల్ కార్మికులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చేస్తున్న ఆందోళనలకు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం 51, 52 డివిజన్లో పనిచేయుచున్న పారిశుధ్య కార్మికులు నెల్లూరు అర్బన్ తహసిల్దార్ ఆఫీస్ సెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పాల్గొని కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ )నగర కార్యదర్శి బీపీ నరసింహ మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థలో పనిచేయుచున్న కార్మికులు అనేక రోజుల నుండి వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మొండిగా వ్యవహరించడం సరైన చర్య కాదని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులు భర్తీ చేయలేదని అన్నారు. నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అటువంటి కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూడడం సరైనది కాదని అన్నారు. వారు చేస్తున్న పోరాటానికి డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు అందిస్తుందని అన్నారు. నగర ప్రజలందరూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం అశోక్, నాయకులు యాకోబు,లాజర్, చిన్ని, జేమ్స్ తదితరులు పాల్గొన్నారు










