Aug 17,2023 21:05

పట్టణంలో మానవహారం చేస్తున్న పారిశుధ్య కార్మికులు

సాలూరు: సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు గురువారం పట్టణంలో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ పట్టణ అధ్యక్షుడు టి.రాముడు, కార్యదర్శి టి.శంకరరావు ఆధ్వర్యాన కార్మికులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు మున్సిపల్‌ కార్పొరే షన్‌, మున్సిపాలిటీ ల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల ను రెగ్యులర్‌ చేస్తామని సిఎం జగన్‌ హామీ ఇచ్చారని చెప్పారు.ఆ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో చాలీచాలని జీతాలతో కార్మికులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నారని చెప్పారు. వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు శ్రీను, సింహాద్రి పాల్గొన్నారు.