న్యూఢిల్లీ : వచ్చె నెల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రిని నిర్ణయించేంది ప్రజలు.. పార్టీ హై కమాండ్ కాదంటూ నవజ్యోత్ సింగ్ సిద్ధు వ్యాఖ్యానించారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్ యూనిట్, పార్టీ అధిష్టానానికి మధ్య విభేదాలు ఉన్నట్లు సిద్ధు వ్యాఖ్యలతో స్పష్టమైంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనేది నిర్ణయించేది ప్రజలు... పార్టీ అధిష్టానం సిఎంని ఎంపిక చేస్తుందని ఎవరు చెప్పారంటూ మీడియాకు కౌంటర్ ఇచ్చారు. మీ మనస్సుల్లో తప్పుడు భావాలను కలిగి ఉండకండని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరుని పార్టీ హైకమాండ్ ప్రకటించబోదని పార్టీ సీనియర్ నేత సునీల్ జాఖర్ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. పార్టీ ఉమ్మడి నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తుందని అన్నారు. దీనికి కౌంటర్గానే సిద్ధు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.










