ప్రజాశక్తి -గాజువాక : పెదగంట్యాడ వికాస్నగర్ ఆర్జిఐ స్టేడియంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల వికలాంగుల చదరంగం పోటీలు సోమవారం ముగిశాయి. ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గౌరవ అతిథిగా సాహితి కంప్యూటర్స్ అధినేత కరణంరెడ్డి నరసింగరావు హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, మెడల్స్, నగదు బహుమతులు ప్రదానం చేశారు. చెవుడు, మూగ, అంధ విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన టీమ్లకు రూ.40 వేలు చొప్పున రూ.1.20 లోల నగదు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఎబిసి ట్రస్ట్ అధినేత డాక్టర్ స్వరూప్ ఆధ్వర్యాన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 200 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అంగవైకల్యం ప్రతిభకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయి వికలాంగుల చెస్ విజేత నవీన్, జాతీయ కార్యదర్శి యేసు రాజు, రాహుల్, రంజిత్, వినోద్బాలు, వెంకట్, జిలకర్ర వెంకటరమణ, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










