
ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, కలెక్టరేట్, యలమంచిలి విలేకరి
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు శకం ముగిసింది. ఆయన హైదరాబాదులోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. యలమంచిలి మేజర్ పంచాయతీకి 25 ఏళ్ల పాటు సర్పంచ్గా పనిచేశారు. తులసీరావుకు ముందు ఆయన తండ్రి, తాత యలమంచిలి సర్పంచ్గా ఉన్నారు. సర్పంచ్గా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పట్టును ఆయన నిలబెట్టుకున్నారు. తన కుమార్తె రమాకుమారిని సర్పంచ్గానూ, రెండుసార్లు యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్గా గెలిపించుకున్నారు. 1989లో విశాఖ డెయిరీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మరణించే వరకు కొనసాగారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన పదవిని కాపాడుకోగలిగారు. ఆయన ఆరోగ్యం రెండేళ్ల నుంచి బాగోలేకపోవడంతో ఆయన రెండో కుమారుడు ఆనందకుమార్కు డెయిరీ కార్యకలాపాల బాధ్యతను అప్పగించారు. డెయిరీ వైస్చైర్మన్ బాధ్యతలు ఆనందకుమార్ చేపట్టాక డెయిరీ వ్యవహారాలన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నారు. 1962లో కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా తులసీరావు కొంతకాలం పనిచేశారు. రెండుసార్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. డెయిరీ ద్వారా కొన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలను నిర్వహించి పాల ఉత్పత్తిదారుల్లో గుర్తింపు పొందారు.
కెజిహెచ్ భావనగర్, గుండె జబ్బుల విభాగాల అభివృద్ధికి డెయిరీ నిధులు అందజేశారు. చోడవరం, అనకాపల్లి, మాడుగల, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిఎస్ఆర్ నిధులతో వంతెనలు, కల్వర్టుల నిర్మాణం, పలు గ్రామాల్లో కల్యాణ మండపాలు నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం వంటివి నిర్మించారు. షీలానగర్లో విశాఖ డెయిరీ ట్రస్ట్ తరపున కృషి ఆస్పత్రి (ప్రస్తుత కిమ్స్) నిర్మించారు. పాడి రైతుల పిల్లలకు ప్రత్యేక పాఠశాల, ఇతర పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకు ప్రోత్సాహకాలు అందజేశారు. నర్సింగ్ పాఠశాలను కూడా ఏర్పాటుచేశారు. కుమారుడు ఆనంద్ కుమార్ టిడిపి తరపున 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమి చెందాక, వైసిపిలో చేరారు. ప్రస్తుతం వైసిపి విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. గురువారం ఎలమంచిలిలో తులసీరావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
పలు అవార్డులు
తులసీరావు కాలంలో విశాఖ డెయిరీ అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2003లో ఎనర్జీ అండ్ ఫ్యూయల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి జాతీయ అవార్డు లభించింది. వాల్తేరు రోటరీ క్లబ్ కార్పొరేట్ సిటిజన్ అవార్డు అందజేసింది. పాల ఉత్పత్తులను చేస్తున్నందుకు ఉత్తమ డెయిరీగా 2009లో నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. ఇలా అనేక అవార్డులు, ప్రశంసలు పొందింది.
తులసీరావు మరణంపై సంతాపం
ఎంవిపి కాలనీ : విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు మృతిపట్ల వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్బాబు సంతాపం ప్రకటించారు. ఆయన పాడి రైతులకు చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.