
ప్రజాశక్తి -భీమునిపట్నం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన స్థానిక సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ఆదివారంతో ముగిశాయి. 14 ఏళ్ల లోపు బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా బాలుర జట్టు విజయనగరంపై 11-8 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. రెండు, మూడు స్థానాల్లో విజయనగరం, కర్నూలు జట్లు నిలిచాయి.
విజయనగరం జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. ఈ జట్టు చిత్తూరుపై 10-9 పాయింట్ల తేడాతో గెలుపొందింది. చిత్తూరు, విశాఖ జిల్లాల జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
విశాఖ జిల్లా బాలుర నుంచి పి.లక్ష్మీదర్, విజయనగరం జిల్లా బాలికల నుంచి పి.భారతి ఆల్ రౌండ్లో నిలిచారు. వీరిద్దరికీ జ్ఞాపిక, ఎస్జిఎఫ్ నుంచి చెరో రూ.500 ప్రోత్సాహక నగదు బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు జ్ఞాపికలు అందజేశారు. బాలికల జట్టులో 12 మందిని, బాలుర జట్టులో 12 మందిని జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు పంపించనున్నారు. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 400 మంది బాలురు, బాలికలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్జిఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ బి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. గెలుపు ఓటములను ఒకేలా స్వీకరించాలని క్రీడా కారులకు సూచించారు. సెయింట్ ఆన్స్ ఎయిడెడ్ పాఠశాల కో-ఆర్డినేటర్ ట్రెసా మేరీ, పర్యవేక్షకులు సుబ్బారావు, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ఎం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుల విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.సతీష్, కెఎం.నాయుడు తదితరులు పాల్గొన్నారు