ప్రజాశక్తి-పరవాడ
మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో రెండు రోజులపాటు నిర్వహించిన రొంగలి కారు నాయుడు మెమోరియల్ జర్నలిస్టుల క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ పోటీల్లో ఏడు జట్లు పాల్గొనగా, పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ క్రికెట్ టీం విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో వెబ్ టైగర్స్, తృతీయ స్థానంలో వెబ్ వారియర్స్ క్రికెట్ టీములు నిలిచాయి. విజేతలకు విశాఖ ఫార్మాసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పిపి.లాల్ కృష్ణ, డీజీఎం గిరిధర్ భక్షి, రాంకీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ శ్రీకాంత్, పరవాడ సిఐ పి.ఈశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని బహుమతులను అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా వెబ్ టైగర్స్ జట్టుకు చెందిన సుధీర్, ఉత్తమ బౌలర్గా పరవాడ క్రికెట్ జట్టుకు చెందిన రాజశేఖర్, ఉత్తమ బ్యాట్స్మెన్గా అనకాపల్లి జట్టుకు చెందిన సతీష్ నిలిచారు. బహుమతుల ప్రధానోత్సవం తర్వాత విజేతగా నిలిచిన పరవాడ క్రికెట్ టీం సభ్యులు బొలెరో వాహనంపై ట్రోఫీతో ఫార్మాసిటీ వీధుల్లో విజయోత్స ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మాసిటీ ఎమ్డి లాల్ కృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టులకు రాంకీ ఫౌండేషన్ సౌజన్యంతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో జర్నలిస్టులు మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ జర్నలిస్టుల స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్.లోకేష్, ఎమ్డి.రాజు, విజేత జట్లు కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.










