ప్రజాశక్తి- మారేడుమిల్లి
మారేడుమిల్లి- చింతూరు ఘాట్ రోడ్డులో కారు లోయలోకి బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.... విశాఖపట్నం నుండి వి.శ్రీనివాస్, అనూష దంపతులతో పాటు వారి బంధువైన యార్లగడ్డ నాగబాబు భద్రాచలం దైవ దర్శనానికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం మంగళవారం తిరిగి చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వారు వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా ప్రయాణిస్తున్న కొందరు లారీ డ్రైవర్లు ప్రమాదాన్ని గమనించి లోయలో పడిన కారులో క్షతగాత్రులను మారేడుమిల్లి పిహెచ్సికి తరలించారు. పీహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ హరికృష్ణ క్షతగాత్రులను పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి 108 అంబులెన్స్లో వారిని తరలించారు.










