Feb 07,2023 23:52

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - ఆరిలోవ : ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పేరిట ముడసర్లోవ పార్కును, రిజర్వాయర్‌కు చెందిన భూములను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని అడ్డుకుంటామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ముడసర్లోవ భూములను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించవద్దని ముద్రించిన పోస్టర్లను మంగళవారం సిపిఎం ఆరిలోవ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆరిలోవ జోన్‌ కార్యదర్శి వి.నరేంద్రకుమార్‌, పి.శంకరరావు, బి.సూర్యమణి, ఎస్‌.రంగమ్మ మాట్లాడుతూ, ముడసర్లోవ పార్కును అభివృద్ధి చేస్తామనే షాకుతో 283 ఎకరాలను వైసిపి నాయకుల బినామీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా లక్షలాది మందికి దాహార్తిని తీర్చే ముడసర్లోవ రిజర్వాయర్‌ను నాశనం చేసేందుకు పాల్పడడం దుర్మార్గమన్నారు. ఇదే జరిగితే భవిష్యత్తులో ప్రజావసరాలకు భూములు లేకుండా పోతాయన్నారు. బిఆర్‌టిఎస్‌ను ఆనుకొని ఉన్న ఈ విలువైన భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై పోరాడేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ నాయకులు వి.కృష్ణమూర్తి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.