
ప్రజాశక్తి - ఆరిలోవ : ముడసర్లోవ భూములను ప్రజావసరాలకు వినియోగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ముడసర్లోవలోని 283 ఎకరాల ప్రభుత్వ భూమిని పిపిపి పేరుతో ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడానికి జివిఎంసి కౌన్సిల్ తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆరిలోవలో సిపిఎం ఆధ్వర్యాన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గురువారం మేయర్ గొలగాని హరివెంకటకుమారి వార్డులో (11వ వార్డు)లో సిపిఎం నాయకులు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ముడసర్లోవ భూముల ప్రయివేటీకరణ ఆపాలని, రిజర్వాయర్ను బోటు షికారుగా మార్చొద్దని, తాగు నీరు అందించే రిజర్వాయర్ను రక్షించుకుందామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పాదయాత్రకు లోకనాథం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముడసర్లోవ భూములు ఎంతో విలువైనవన్నారు. ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఈ రిజర్వాయర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరిలోవ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మేయర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇక్కడ ఉన్న విలువైన భూములను ప్రయివేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. మేయర్ పదవి ఇచ్చినందుకు కానుకగా ముడసర్లోవలో 283 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వారికి ఇస్తూ వైసిపి నాయకుడు విజయసాయిరెడ్డి రుణం తీర్చుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు అడిగితే నగరానికి దూరంగా కేటాయిస్తున్న ప్రభుత్వం.. ముడసర్లోవ భూములను మాత్రం అనుయూయులకు కట్టబెడుతోందన్నారు. ఈ భూముల రక్షణకు ప్రజలను, ప్రజాసంఘాలను, కలిసివచ్చే అందరికీ కలుపుకొని సిపిఎం పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్కెఎస్వి.కుమార్, వి.నరేంద్రకుమార్, వి.కృష్ణమూర్తి, ఎస్.రంగమ్మ, ఎ.రమణ, తులసీరావు, భూలోకరావు, లక్ష్మీనారాయణ, వై.అప్పారావు, నాగరాజు, కుమారి, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.