ప్రజాశక్తి-పెందుర్తి : తమకు పరిహారం ఇవ్వకుండా జగనన్న కాలనీలో చేపడుతున్న పనులను బుధవారం ముదపాకకు చెందిన దళిత నిర్వాసితులు అడ్డుకున్నారు. దీనిపై ఏడుగురు నిర్వాసితులపై స్థానిక తహశీల్దార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎసిపి స్పందించి, పనులను అడ్డుకున్న నిర్వాసితులను పిలిచి, పనులను అడ్డుకోవడంపై మందలించారు. తమకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపడుతున్నారని, దీనిపై ఇప్పటికే తాము కోర్టుకు వెళ్లామని, కోర్టులో కేసు ఉంటుండగా ఎలా పనులు చేస్తారని విన్నవించారు. దీనిపై ఎసిపి స్పందిస్తూ కోర్టు పరిధిలో ఉన్న భూమిలో ఎటువంటి పనులు, మిగిలిన చోట చేసిన పనులను అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించడం విశేషం.
కాగా ముదపాకలో జగనన్న కాలనీకి తమ పూర్వికుల నుంచి వచ్చిన భూమిని ల్యాండ్ పూలింగ్లో ఇచ్చామని, ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని నిర్వాసిత రైతు నీలాపు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు కలెక్టర్, ఆర్డిఒ, తహశీల్దార్లకు విన్నవించామని, ఎవరూ స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించామని అంటున్నాడు.










