ముదివర్తిపాళెం కాజ్వేను నిర్మించాలి
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ముదివర్తి నుండి ముదివర్తిపాలెం కాజ్వేను వెంటనే నిర్మించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గురునాధం డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పల్లిపాడు నుండి గంగపట్నం వరకు ప్రజా పోరుయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ప్రజాపోరుయాత్ర చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోవూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని, లిక్విడేషన్ ఆర్డర్ను రద్దు చేయాలన్నారు. రాచర్లపాడు ఇప్కో భూములకు నష్టపరిహారం రైతులకు అందించాలన్నారు. పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. చంద్రశేఖరపురం పరిశ్రమల స్థాపనకు ఎపిక్ సంస్థ ద్వారా సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించాలన్నారు. కోవూరు చెరువు కలుజుపై బ్రిడ్జి నిర్మించాలన్నారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బి, లింకు రోడ్లను మరమ్మతు చేయాలన్నారు. చెరువు లోతట్టు సాగుదారులను గుర్తించి పట్టాలివ్వాలన్నారు. నియోజకవర్గంలో ఇసుక మట్టి మాఫియాను అరికట్టి ప్రకృతి వనరులను కాపాడాలన్నారు. పారుదల కాలువలు ఆధునికీకరించాలన్నారు. కొడవలూరు రైల్వే గేట్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య, టివివి ప్రసాద్, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు మరుబోయిన రాజా, పి.మురళి, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, తిక్కవరపు ప్రభాకర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్ శ్యామ్రెడ్డి, రైతు సంఘం నాయకులు వెన్ను వేణు, చీమకుర్తి శ్రీనివాసుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










