ప్రజాశక్తి- లావేరు : వెలుగు సంస్థలో పనిచేస్తున్న విఒఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మూడేళ్ల కాల పరిమితిని తక్షణమే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మండలంలోని అదపాక మార్కెట్ యార్డులో ఎచ్చెర్ల క్లస్టర్ సమావేశం మంగళవారం నిర్వహించారు. విఒఎలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. సిబిఒహెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. గ్రూప్ ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్ని రకాల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.వయసు పైబడిన, అనారోగ్యంతో ఉన్న వారి కుటుంబ సభ్యులకు విఒఎలుగా అవకాశం కల్పించాలన్నారు. జెండర్, వయసు, చదువు పేరుతో తొలగింపులు ఆపాలన్నారు. సమావేశంలో విఒఎల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, అరుణ, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.అశిరినాయుడు, ఎం.జగన్, కె.సంతు, కె.జయలక్ష్మి, కె.మీనాక్షి, ఎం.ఉష, కె.సరిత పాల్గొన్నారు.










