Jun 27,2023 00:01

కాకినాడలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి - యంత్రాంగం
మత్తుకు బానిస కావొద్దని పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సూచించారు. సోమవారం జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలు, అవగాహనా సదస్సులు నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్‌లో యువత మత్తుకు బానిస కాకుండా భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఎస్‌పి సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్‌ కార్యాలయంలో శనివారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుగుడి సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాఆలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడారు. ప్రపంచంలోనే అధిక శాతం యువత ఉన్న దేశంగా భారతదేశం విరాజిల్లుతుందన్నారు. యువత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు సాగాలన్నారు. మాదక ద్రవ్య నిరోధకానికి వారు రోజులపాటు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇకపై మత్తు పదార్థాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తప్పమన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్‌పి శ్రీనివాస్‌, సబ్‌ అడిషనల్‌ ఎస్‌పి డాక్టర్‌ జి.ప్రేమ్‌కాజల్‌, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎం.పవన్‌కుమార్‌, జనరల్‌ సెక్రెటరీ డాక్టర్‌ పి.కిరణ్‌, డాక్టర్‌ వరప్రసాద్‌, అడిషనల్‌ ఎస్‌పి ఎఆర్‌బి సత్యనారాయణ, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. పెద్దాపురంలో వైజ్‌ సిబిఒ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మహారాణి కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు బి.మల్లేశ్వరి, పిడిఆర్‌.జయ, పిఎండి.రాజు మాట్లాడారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.వీరయ్యచౌదరి, ఎన్‌సిసి ఆఫీసర్‌ సిహెచ్‌.ఏసుబాబు, అధ్యాపకులు ఎం.తాతాజీ, జి.రమేష్‌, జి.వెంకటేశ్వర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రౌతులపూడి శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో కోటనందూరు ఎస్‌ఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ రఘు, వై. దొర సిబ్బంది పాల్గొన్నారు.