ప్రజాశక్తి-నగరం: బాపట్ల జిల్లా నగరం కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్స్ సంకల్పం అనే కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు వాడటం వలన జరిగే అనర్ధాలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రేపల్లె డిఎస్పి టి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో ఆల్కహాల్, గంజాయి, కోకాయ, టొబాకో మొదలగు మత్తు పదార్థాల కు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుం టున్నారని అన్నారు. ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల ఆరోగ్యం చెడిపోయి మానసిక రోగులుగా మారుతున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు సేవించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివశంకర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ అనగాని హరికృష్ణ, ఎస్ఐలు డి రామకృష్ణ, కొండారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










