Jan 07,2021 06:41

సంప్రదాయవాదులు, దైవ విశ్వాసం గలవారు అన్ని మతాల బోధకులు, ప్రవచనకారులు వగైరాలంతా అసలు నీతి నిజాయితీ అనే మాటలు ఉచ్ఛరించగూడదు. ఎందుకంటే వారు నిరూపణలేని దైవం మీద విశ్వాసం ఉంచుకోవడంతో పాటు జనాన్ని కూడా కుట్ర పూరితంగా మోసం చేస్తున్నారు. వాస్తవాలు, నిజాలు మాట్లాడని వారు తమకు నీతి నిజాయితీ ఉందని, ఇతరుల్లో అవి ఉండాలని బోధించడం హాస్యాస్పదం. అబద్ధ్దాలు ప్రచారం చేసేవాడు ఇతరులకు నిజం మాట్లాడమని చెప్పినట్టుగా ఉంది. చిత్తుగా తాగిన తాగుబోతు తడబాటు లేకుండా అడుగులేయాలని హితబోధ చేసినట్లు ఉంటుంది. ఆత్మ ద్రోహం చేసుకుని బతుకుతూ, ఇతరులకు ద్రోహం చేస్తూ, నైతికత గురించి నీతి నిజాయితీల గురించి ఉపన్యాసాలిస్తే వాటికి అసలు విలువ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి!


నిజానికి ఇస్లాం మతం ప్రమాదంలో లేదు. క్రైస్తవం ప్రమాదంలో లేదు. హిందూ మతం కూడా ప్రమాదం లేదు. మత పిచ్చిలో పడ్డ మనిషే ప్రమాదంలో ఉన్నాడు. చనిపోయిన వాడికి తను చనిపోయినట్లు తెలియదు. దగ్గరి వాళ్ళంతా విలవిలలాడతారు. మూర్ఖత్వంలో ఉన్నవాడికి కూడా తను మూర్ఖత్వంలో ఉన్నాడని తెలియదు. ఇతరులు జాలిగా బాధపడతారు. మూర్ఖత్వం మరణం కంటే తక్కువది కాదు. అందుకే విశ్వవిఖ్యాత రచయిత మార్క్‌ ట్వెయిన్‌ ఇలా అన్నారు. ''వాళ్ళు పిచ్చి వాళ్ళయి పోతున్నారని వాళ్ళకు తెలియకుండా, జనాన్ని పిచ్చి వాళ్ళను చెయ్యొచ్చు... ఒక వాస్తవాన్ని చెప్పి ఒప్పించడం కష్టం!'' అని! ఉగ్రవాదులకీ వీరికీ తేడా ఏమిటంటే వారికి మతపిచ్చి మాత్రమే ఉంటుంది.మూర్ఖత్వంలో కొట్టుమిట్టాడే వీరికి కులపిచ్చి, వర్ణపిచ్చి, వర్గపిచ్చి, ప్రాంతీయ పిచ్చిలాంటివి ఎన్నో ఉంటాయి. మతపిచ్చి ఉన్న వాడు ఇతర మతస్తుల్ని ద్వేషిస్తాడు. కులపిచ్చిగాడు మాత్రం స్వంత మతంలోని మనుషుల్నే అంటరాని వాళ్ళుగా దూరం పెట్టి అవమానిస్తాడు. తన ఆధిక్యత చూపుకోవడమే వాడికి ముఖ్యం. ఇలాంటి పరిస్థితి గమనించి రాహుల్‌ సాంకృత్యయన్‌ ఏనాడో ఓమాట చెప్పారు. ''ప్రతి మతం ఇతర మతానికి వ్యతిరేకం. కానీ, ప్రజల్ని పీడించడానికి అన్నీ ఏకమౌతాయి.'' నిజమే కదా? ఈనాటికీ పరిస్థితి మారలేదు-ఉగ్రవాది మతం పేరుతో బయటి నుండి మనపై దాడి చేస్తాడు.


వీడు మన అగ్రవాది-మతం పేరుతోనే స్వదేశీయుల పైనే దాడులు చేస్తాడు. ఇద్దరి ఉన్మాదం ఒకటే కదా? ఇదే విషయం మీద ఒక ఇమామ్‌ ఏమన్నాడో చూడండి -'' ఆత్మాహుతి ద్వారా స్వర్గానికి వెళ్ళడం ఖాయం -అని విశ్వసిస్తూ ఉంటే గనక, వారు తమను మాత్రమే పేల్చుకోవాలి. అంతే గాని ఇతరులను కాల్చడం దేనికీ? అది న్యాయమా?'' అని ప్రశ్నించాడు ఇమామ్‌ తవ్‌హిడి.


''మతం ఒక ప్రమాదకరమైన మూర్ఖత్వాన్ని నేర్పుతూ ఉంటుంది. అది చావుతో కూడా ముగిసిపోదు'' అని అన్నారు ప్రముఖ జీవ పరిణామ శాస్త్రవేత్త రిచర్డ్‌్‌ డాకిన్స్‌. ఆయన హేతువాది కూడా కాబట్టి అలా అన్నాడని అనుకుందాం. మరి హేతువాదం తోనూ, విజ్ఞాన శాస్త్రంతోనూ అంతగా సంబంధం లేని ప్రఖ్యాత ప్రకృతి కవి విలియం వర్డ్స్‌ వర్త్‌ కూడా అదే అభిప్రాయం ఎందుకు వెలిబుచ్చాడు- ఆలోచించాలి కదా? పైగా ఇద్దరూ బ్రిటీష్‌ వారే. వర్డ్స్‌ వర్త్‌ చెప్పిన మాట ఏమిటంటే -''శాంతి సౌఖ్యం, విశ్రాంతి ఇవ్వలేని మతం కంటే, ప్రకృతి ఆరాధనే ఉత్తమం? '' విశ్వవిఖ్యాత బ్రిటీష్‌ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌ తన మిత్రుడికి రాసిన ఒక ఉత్తరంలో మతం పట్ల తన అభిప్రాయం తెలియజేశాడు. జీసస్‌ మీద గాని, బైబిల్‌ మీద గాని, తనకు విశ్వాసం లేదని - ఆయన తన మిత్రుడు ఫ్రాన్సిస్‌ మెక్‌ డెర్మొట్‌ అనే యువ బారిస్టర్‌కు రాశాడు. ''న్యూ టెస్ట్‌మెంట్‌ మీద మీకు విశ్వాసం ఉందో లేదో దయచేసి తెలియజేయండి-నేను దాని బహిర్గతం చేయను'' అని ఆ యువ బారిస్టర్‌ లేఖ రాస్తే-దానికి జవాబుగా డార్విన్‌ అలా రాశాడు. అయితే చాలా కాలానికి డార్విన్‌ చేతి రాతతో ఉన్న ఆ ఉత్తరం న్యూయార్క్‌లో వేలం వేశారు. అప్పుడు అది లక్షా తొంభయ ఏడువేలు పలికింది. ఆయువ బారిస్టర్‌ లేఖ రాసింది. 23 నవంబర్‌ 1880న అయితే, ఓ యాభై సంవత్సరాల తర్వాత అది వేలం వేయబడింది. డార్విన్‌ వ్యక్తిత్వానికి, చేతిరాతకు, అభిప్రాయానికి ఎంత విలువ ఉంటే, ఆ రోజుల్లోనే అంత డబ్బుకు వేలం వేయబడాలీ? డార్విన్‌ మతం గురించి , దేవుడి గురించి ఎక్కడా ఏమీ చెప్పలేదు. జీవ పరిణామం ఎలా జరిగిందో రుజువులతో సహా తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అంతే ప్రపంచ వైజ్ఞానిక జగత్తు జేజేలు పలికింది. అదే క్రమంగా దైవ విశ్వాసకుల్ని ఆలోచనలో పడేస్తూ వస్తోంది.


సహస్ర నామాలు వంటి విషయాలు దాటి అయ్యవార్లు రాలేకపోతున్నారు. అంతకు మించిన జ్ఞానం వారికి లేదని సామాన్య జనం గ్రహించుకోవాలి. ఎక్కువ శాతం ఉన్న చెడుని దాచేసి, కొద్దిగా ఉన్న మంచిని చూపి మత బోధకులు తమ మత గ్రంథాల డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. పైగా తమకు తామే, తాము అభ్యుదయ వాదులమని రొమ్ము విరుచుకుంటూ ఉంటారు. మిత్‌- నుండి పుట్టితందే మైథాలజీ అయినప్పుడు అది చరిత్ర అని నిరూపించడానికి కొందరు విఫలయత్నం చేస్తుంటారు. అందుకే డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ అన్నారు. ''హేతువాదానికి నిలబడని వాదనలు విశ్వసించగూడదు. సమాజం చైతన్యవంతంగా పురోగమించాలంటే కాలాన్ని అనుసరించి నడుచుకోవాలి'' -అని! అంతేకాదు ఇదే విషయాన్ని బ్రిటీష్‌ అమెరికన్‌ వక్త, జర్నలిస్ట్‌, విశ్వ విఖ్యాత రచయిత క్రిస్టోఫర్‌ హిచ్చెన్స్‌ మరింత స్పష్టంగా చెప్పారు. ''ఆధారం లేకుండా చెప్పబడుతున్న దేనినైనా..ఆధారం లేకుండానే తోసిపుచ్చవచ్చు-''అని!


మతాచారాల మూఢ నమ్మకాల ఫలితంగా సాగిన హింసను కొంతైనా తగ్గించి, శాంతిని స్థాపించింది బుద్ధుడే. హిందూ పరిపాలకులెవరూ శాంతిని కోరుకోలేదు. హిందూ మతాన్ని, వేదాలను నమ్మని చార్వాకుల్ని ధర్మరాజు(మహా భారతంలోని పాత్ర కాదు) అనే పరిపాలకుడు నిర్దాక్షిణ్ణంగా హత్యలు చేయించాడు. ఆ చార్వాకుల స్ఫూర్తితోనే బుద్ధుడు నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడు. బుద్ధుడు నేర్చిన నాస్తికత్వం అజితకేశకంబళి అనే భౌతికవాదితో జరిగిన చర్చలో నేర్చుకున్నదే! అందువల్ల బుద్ధుణ్ణి ఒక సామాజిక వాదిగా చూడాలి. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి సైతం ఈ దేశంలో దేవుణ్ణి చేశారు. ఆయన జీవిత కథని ఆయన బోధనల్ని మార్చి రాశారు. చివరకు ఆయననే దశావతారాల్లో చేర్చుకున్నారు. కొన్నేళ్ళ క్రితం ఈ నేల మీద నడయాడిన చారిత్రక పురుషుడు. మహోన్నత వ్యక్తిత్వం గల గొప్ప సంఘ సంస్కర్త! బౌద్ధంలోని అహింసని హైజాక్‌ చేసిన మనువాదులు తాము అహింసా వాదులమని ప్రకటించుకుంటూ ఉంటారు. అదే నిజమైతే మరి వారు పూజించే జంతు బలులు, నర బలులు ఎందుకున్నాయి? శతాబ్దాలు గడిచినా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎందుకు దొరకడం లేదూ? ఏ మానవత్వాన్ని నిలపడానికి ఇవి సంస్కృతిలో భాగమయ్యాయి? దుష్టులను శిక్షిస్తున్నాడనే నెపం మీద ఇందుకు దుష్టులను సృష్టించడం దేనికీ? మానవులందరినే సద్భుద్ధితో సృష్టిస్తే సరిపోయేది కదా? ఈ కలహాలు, హత్యలు, దోపిళ్ళు, రేప్‌లు, యుద్ధాలు ఉండేవి కావు కదా?


మొదట దుష్టులను సృష్టించడం, మళ్ళీ వాళ్ళను సంహరించడానికి ఆయుధాలు ఉపయోగించడం, హింసను ప్రేరేపించడం.. సున్నిత మనసులైన మావులు, శాంతి కాములకులు భరించలేరు కదా? జనాన్ని భయపెట్టి, అందులోంచి భక్తి పుట్టిస్తారా? భయపెట్టే తండ్రిని ఏ పిల్లలూ ప్రేమించరు. విశ్వ మానవ సౌభ్రాతృత్వం గురించి ఏ దేవుడైనా చెప్పాడా? లేదే! ఇవి సర్వకాల సర్వావస్థలకు ప్రామాణికం ఎలా అవుతాయి? ఏ మతమైనా నరకం పేరుతో భయపెట్టి, స్వర్గం పేరుతో ఆశపెట్టి భక్తులను లొంగదీసుకునేదే''-అని అన్నాడు రాబర్ట్‌ జి. ఇంగర్సాల్‌, అమెరికన్‌ రచయిత స్వేచ్ఛాలోచనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చినవాడుబలులు, యజ్ఞాలు, యాగాలు హిందూ ధర్మంలో భాగమై ఉన్నప్పుడు, వేల ఏళ్ళ క్రితమే బుద్ధుడు వాటిని ఎందుకు వ్యతిరేకించాడో ఒక సారి ఆలోచించండి. వాటివల్ల కొంతమంది అగ్రవర్గాలకు ఏం మేలు జరిగేదో కాని, సామాన్యులు తీవ్రంగా నష్టంపోయేవారు. వాటివల్ల వ్యవసాయం బాగా దెబ్బతినేది. పశువులపై ఆధారపడ్డ ఇతర వృత్తుల వారిక్కూడా తీవ్ర నష్టం కలిగేది. ఇది కేవలం హిందూ మతానికే పరిమితమైలేదు. ఇతర మతాలలో కూడా ఉంది.


''దేవుడి పట్ల సమర్పణ భావం లేకపోతే జరిగే నష్టం ఏమీ ఉండదు. కాని, నైతికత లేకపోతే.. అన్నీ కోల్పోయినట్లే. నైతికత అనేది ప్రజల ఆస్థి''- అని అన్నారు. పెరియార్‌ ఇవి రామస్వామి తమిళనాడులోని శ్రీరంగ పట్నంలో శ్రీ రంగనాథ ఆలయం ఎదురుగా ఉన్న పెరియార్‌ విగ్రహం కింద పాలరాయి మీద చెక్కబడి ఉన్న సందేశం ఈ విధంగా ఉంది.
 

దేవుణ్ణి మరిచి మనిషికి కృతజ్ఞతలు చెప్పు
దేవుడు లేదు. దేవుడు అసలే లేడు!!
సమర్పణ భావం వ్యక్తిగత విషయం
నైతికత ప్రజల సొత్తు - ఇ.వి. రామస్వామి (17 సెప్టెంబర్‌ జయంతి)


దేశం నిండా వేల దేవాలయాలు కడితే నాస్తికుల మనోభావాలు దెబ్బతినలేదు. కాని ఒక దేవాలయం ఎదురుగా ఉన్న పెరియార్‌ సందేశం వల్ల ఆస్థికుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకు కొందరు కొర్టుకెక్కారు. '' భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండొచ్చు అది నేరం కాదు. - అని కోర్టు చెప్పడంతో కోర్టు కెక్కిన వారి నోళ్ళు మూతపడ్డాయి!
                                          * డాక్ట‌ర్ దేవ‌రాజు మ‌హారాజు, సుప్రసిద్ధ సాహితీవేత్త, బయాలజీ ప్రొఫెసర్‌.