మరో నల్ల చట్టం తెచ్చేందుకు కేంద్రం కుట్ర
- యూనిఫామ్ సివిల్ కోడ్కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు నిరసన
ప్రజాశక్తి - పాములపాడు
యూనిఫామ్ సివిల్ కోడ్తో బిజెపి ప్రభుత్వం మరో నల్ల చట్టాన్ని తెచ్చేందుకు కుట్ర పన్నుతోందని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు యుసిసికి వ్యతిరేకంగా పాములపాడు ప్రధాన రహదారిపై ప్రజా సంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు యస్. షర్ఫద్దీన్ అలి, బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూరు ఇంచార్జ్ ఎల్. స్వాములు, బీసీ సంఘం నాయకులు మురళీమోహన్, నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఎం. వెంకట రమేష్, రజక సంఘం మండల అధ్యక్షుడు వి. రామకృష్ణుడు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు బి.గాలి గౌడు, వైసిపి మండల నాయకుడు లింగాల పి.అంబయ్య, తదితర ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. విభిన్న జాతులు, మతాలు, కులాలు ఉన్న భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజా అభిప్రాయం కోసం ఈనెల 14 నుంచి జూలై 14 వరకు సూచనలు ఇవ్వాలని కోరిందన్నారు. కానీ దేశ ప్రజలకు ఇప్పటివరకు యూనిఫామ్ సివిల్ కోడ్పై అవగాహన లేనందున ఈ అభిప్రాయం తెలపడంలో వెనుక పడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రజలు తమ అభిప్రాయాలను ఆన్లైన్ ద్వారా, వినతి పత్రాల ద్వారా తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు జి.సాయి కృష్ణ, ముస్లిం మైనార్టీ సంఘం నాయకులు సయ్యద్ ముర్తుజా వలి, సద్దాం, తదితర సంఘాల నాయకులు వినతి పత్రాలు పంపారు.










