Jul 27,2023 20:37

ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - కౌతాళం
దేశంలో నరేంద్ర మోడీ పాలనను తరిమికొట్టాలని, మోడీ పాలన నుంచి ఆడబిడ్డలను రక్షించాలని నాయకులు కోరారు. గురువారం ఆవాజ్‌ కమిటీ, జై భీమ్‌ కమిటీ ఆధ్వర్యంలో కౌతాళంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిఎస్‌ఐ చర్చి దగ్గర నుంచి ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్‌ సర్కిల్‌లో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి మనవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జై భీమ్‌ నాయకులు వీరేష్‌, అవతారం, దర్గా ధర్మకర్త మున్నా పాషా, ఆవాజ్‌ నాయకులు మాట్లాడారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసకాండను వెంటనే ఆపాలని, అక్కడ ఉన్న క్రిస్టియన్లను కాపాడాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌లో మరణ హోమం జరుగుతున్నా ప్రధాని స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో క్రిస్టియన్లు, ముస్లిం, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఐకమత్యంతో తిప్పికొట్టాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అదుపు చేసి, పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఆవాజ్‌ నాయకులు ఖాజా హుస్సేన్‌ పాల్గొన్నారు.