ప్రజాశక్తి - చిప్పగిరి
మండలంలోని బంటనహల్ గ్రామంలో 8 ఏళ్లుగా మొహర్రం వేడుకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు శనివారం ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణను కలిసి మొహర్రం పండగ జరుపుకోవడానికి అనుమతులు ఇప్పించాలని కోరారు. స్పందించిన నారాయణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్తో మాట్లాడి మొహర్రం పండగను జరిపించేందుకు అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిప్పగిరి ఎస్ఐ రమేష్ బాబు, మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, బంటనహల్ గ్రామస్తులతో సమావేశమై పండగను ప్రశాంతంగా జరుపుకుంటామంటే అనుమతులు ఇస్తామని తెలిపారు. గ్రామస్తులంతా ఏకమై ప్రశాంతంగా జరుపుకుంటామని, అందుకు తామంతా సంతకాలు పెట్టిన పత్రాలను అందజేస్తామని చెప్పారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ మొహర్రం వేడుకలకు రూ.20 వేలను గ్రామస్తులకు విరాళంగా అందజేశారు. మొహర్రం వేడుకలకు అనుమతులు ఇప్పించినందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. వైసిపి మండల కన్వీనర్ ఏరూరు రంగస్వామి, ఆలూరు తాలూకా బూత్ కమిటీ సభ్యులు రాజన్న, గుమ్మనూరు శ్రీధర్, దౌల్తాపురం సేకన్నా, వెంకటేష్, రంగముని, సూరి, రమేష్, రాఘవేంద్ర పాల్గొన్నారు.
మొహర్రం వేడుకలకు గ్రామ పెద్దలకు విరాళం అందజేస్తున్న నారాయణ










