ప్రజాశక్తి-పెదబయలు:బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో. చేసిన తీర్మానం వెనక్కి తీసుకోవాలని మండల కేంద్రంలో సోమవారం గిరిజన సంఘం, గిరిజన అఖీల పక్షం అధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ అతిధి గృహం నుండి పోలీసు స్టేషన్ వరకు అర్థ నగ ప్రదర్శన చేశారు. విల్లంబులు చేతబట్టి ముఖ్యమంత్రి, గిరిజన ఎమ్మెల్యే ల్లారా ఖబడ్దార్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద మానవ హారం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేసేటప్పుడు పోలీసులు నిలువరించారు. అనంతరం సంప్రదాయ బద్దంగా దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృధ్వీరాజ్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యా వంతులు, సొంత పార్టీ ఎమ్మేల్యేలు వ్యతిరేకించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బుద్ది రాలేదని తెలిపారు.గిరిజన నిరుద్యోగులకు వందకు వంద శాతం ఉద్యోగాలు కల్పించే జిఓ 3పై ఎందుకు రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపిలకు భవిష్యత్తులో రాజకీయంగా పుట్ట గతులు ఉండవన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపిపి వి కొండయ్య మాట్లాడుతూ, అసెంబ్లీలో చేసిన తీర్మానం ఉప సంహరించుకోకుంటే పోరాటం ఉదృతం చేస్తా మన్నారు. ఈనెల 31న జరిగే రాష్ట్ర వ్యాప్త మన్యం బందును జయప్రదం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బోండా సన్నిబాబు, సీఐటీయూ కార్యదర్శి కె.శరబన్న, వైస్ ప్రెసిడెంట్ బి గంగాదరం, జెఏసీ నాయకుడు పోతురాజు, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి భూషన్, రవి కుమార్, జనసెన నాయకుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
హుకుంపేట: అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.క్రిష్ణా రావు మాట్లాడుతూ, బోయ,వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చెటప్పడు మన గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కనీసం నోరు మెదపక పోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన, ప్రజా సంఘాలు, ఆదివాసీలంత ఒక్క వేదికపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి వి.లక్ష్మణ్ రావు, ఐద్వా సంఘం నాయకు లు ఎస్.హైమావతి, జి.ఆనంద్ పాల్గొన్నారు.










