Jul 24,2023 00:23

అనకాపల్లిలో మానవహారం చేపడుతున్న నేతలు


ప్రజాశక్తి- యంత్రాంగం
మణిపూర్‌ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అరికట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. అనకాపల్లి, విశాఖలో ర్యాలీలు, మానవహారాలు ఆదివారం చేపట్టారు.
అనకాపల్లి : మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు తక్షణమే స్పందించి శాంతిని నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని అనకాపల్లి జిల్లా యునైటెడ్‌ ఫాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రతినిధులు కోరారు. ఆదివారం జిల్లాలో కసింకోట, మునగపాక, అచ్చుతాపురం, రాంబిల్లి, పరవాడ, కోటపాడు, చోడవరం, తదితర మండలాలలో గల క్రైస్తవ సంఘాలతో కలిసి పట్టణంలోని శాంతి ర్యాలీ నిర్వహించారను. నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో మానవహారంగా ఏర్పడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్స ఫెలోషిప్‌ అధ్యక్షుడు .సిహెచ్‌.ప్రకాష్‌ మాట్లాడుతూ మణిపూర్‌లోక్రైస్తవులు, సామాన్యులపై జరుగుతున్న దాడులు అమానుషమన్నారు ఫెలోషిప్‌ గౌరవ అధ్యక్షుడుఎస్‌ .క్రాంతి పాల్‌ మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న దాడులతో నిరాశ్రయులైన వారికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌.వినోద్‌ అబ్రహాం, చైర్మన్‌.బి యోహాను, కెపిడి ఆర్‌ ప్రసాద్‌, కె.సన్నీ జేమ్స్‌, ఉపాధ్యక్షుడు. ఏ శ్యాంబాబు, కార్యదర్శి.బి ఏసురత్నం, ఉప కార్యదర్శి ఏసుదాసు, కోశాధికారి ఎం. రాజబాబు, ఉప కోశాధికారి బి .అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
ఆనందపురం : మణిపూర్‌ రాష్ట్రంలో మహిళలను నగంగా ఊరేగించడానికి ఖండిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విఒఎల సంఘం (సిఐటియు) ఆధ్వర్యాన ఆనందపురం జంక్షన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనందపురం కూడలిలో మానవహారం నిర్మించారు. ఈ ప్రదర్శనకు విఒఎల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.రూపాదేవి, జిల్లా గౌరవాధ్యక్షులు పి.మణి హాజరై మాట్లాడారు. దేశంలో భారతమాతలకు రక్షణ లేదని మణిపూర్‌ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు వందల సంఖ్యలో జరిగాయని ముఖ్యమంత్రి ప్రకటించడం తీవ్ర వేదనని కలిగిస్తోందన్నారు. మణిపూర్‌ మహిళలకు సత్వర న్యాయం జరిగేటట్టు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శనలో యూనియన్‌ నాయకులు అపర్ణ, కుంచమ్మ, శ్రీలక్ష్మి, పార్వతి, సంతోష్‌ కుమారి, శారద, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
కూర్మన్నపాలెం : మణిపూర్‌ రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుతూ హోలీ ఫ్యామిలీ చర్చి విచారణ కాపరి ఫాదర్‌ సరిసాప్రతాప్‌ ఆధ్వర్యాన వడ్లపూడిలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొని, నినాదాలుచేస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఫాదర్‌ సరిసాప్రతాప్‌ మాట్లాడుతూ, మణిపూర్‌లో పేద, బలహీన, మైనార్టీ కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. లౌకిక రాజ్యమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ సమ భావముతో అందరూ నడుచుకోవాలని కోరారు. రాజ్యాంగం కల్పించిన లౌకిక సిద్ధాంతాలు పాటిస్తూ, నైతిక విలువలతో ముందుకు సాగాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, సలహా మండలి యువతీయువకులు, విన్సెంట్‌ డి పాల్‌, మహిళా సంఘం సభ్యులు, దళ సభ్యులు పాల్గొన్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : మణిపూర్‌ అమానుష ఘటనను ఖండిస్తూ సిఐటియు, ఐద్వా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌టిసి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు తులసీరామ్‌, ఐద్వా మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి కె.కుమారి మాట్లాడారు. అలాగే దక్షిణ నియోజకవర్గంలోని జ్ఞానాపురం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద పిఒడబ్ల్యు, ఐఎఫ్‌టియు, ఎంఎన్‌ఎస్‌ఎస్‌, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. మణిపూర్‌ సిఎం తక్షణమే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కె.నిర్మల, ఎస్‌.వెంకటలక్ష్మి, ఇందిర, ఇ.లక్ష్మి పాల్గొన్నారు. దళిత హక్కుల సమాఖ్య ఆధ్వర్యంలో ఎల్‌ఐసి అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సమాఖ్య అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ, దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్‌ సుర్ల వెంకటరమణ, ప్రతినిధి బంకపల్లి అప్పారావు, భీమ్‌ సేన వార్‌ నాయకులు దుర్గారావు, గుడివాడ అప్పారావు, రవికుమార్‌, వై.బాలకృష్ణ, న్యాయవాది బీర రత్నకుమారి, భారత నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షులు వై.నూకరాజు, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు రత్నం, సబ్బవరం అప్పారావు, బి.అప్పారావు, భీమారావు గురవయ్య పాల్గొన్నారు.