Jul 21,2023 23:41

తాడేపల్లిలో ఐద్వా నిరసన

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : మణిపూర్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం నిరసనలు తెలిపారు. ఇందులో భాగంగా తాడేపల్లి పట్టణంలోని సుందరయ్యనగర్‌ లీలాసుందరయ్య కళావేదిక వద్ద ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మోడీ పాలనలో మహిళకు రక్షణ లేదని, ఇప్పటికైనా ప్రధాన మంత్రి నోరు విప్పాలని, మణిపూర్‌ రావణకాష్టాన్ని నిలుపుదల చేయాలని నినదించారు. జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్‌ ఆలపించిన గీతాలు మహిళలను కంటతడి పెట్టించాయి. కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి పి.గిరిజ, కె.ఉషారాణి, సుధ, కె.విజయలక్ష్మి, కె.రత్నం, జి.అరుణ, యు.జ్యోతి, కె.బేబి, ఎన్‌.రేణుక, సిఐటియు నాయకులు కె.కరుణాకరరావు, ఎస్‌కె బాష, బి.రామారావు, కొండబాబు పాల్గొన్నారు. గుంటూరులో అవగాహన సంస్థ ఇర్వహించిన సమావేశంలో విద్యావేత్త సింగరయ్య మాట్లాడుతూ మణిపూర్‌లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో కుకీ మహిళను నగంగా ఊరేగింపు, అత్యాచారం ఘటన చెబుతుందని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై దేశం యావత్తు కోపంగా ఉందన్నారు. ఈ ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించిన తర్వాత ప్రదాని స్పందించారన్నారు. విశ్రాంత అధికారి వికెడి మల్లేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రదాని మోదీ అన్ని పార్టీల ప్రతినిధులతో మణిపూర్‌ వెళ్లి పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో విద్యావేత్త చంద్రయ్య, తిరుపతయ్య పాల్గొన్నారు. మంగళగిరి పార్క్‌ రోడ్డులోని ఇమ్మానుయేలు చర్చి వద్ద మెట్రో రీజియన్‌ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌ పాస్టర్‌ బొంతపురి రవి ప్రకాష్‌ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు. మణిపూర్‌ ఘటనలపై బిజెపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రధాని మోడీ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పాస్టర్లు పి.దయా రత్నకుమార్‌, డి.నాగయ్య, బి.సాల్మన్‌రాజు, ఎం.భాస్కరరావు, కె.వినరుకుమార్‌, ఎన్‌.బాలస్వామి, కె.ప్రశాంత్‌రాజు, జి.లూథర్‌ పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులోని లాలాపేట హిమనీ సెంటర్‌లో శుక్రవారం ర్యాలీ చేశరు. పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ రాష్ట్రపతి జోక్యం చేసుకుని అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలన్నారు. మహిళలకు ఇచ్చే రక్షణపై ప్రధాని మోడీ పార్లమెంటులో కనీసం సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. జిల్లా అధ్యక్షులు ఎల్‌.ఈశ్వరరావు, నగర అధ్యక్షులు షేక్‌ ఉస్మాన్‌, నాయకులు చంద్రపాల్‌, సందీప్‌, జక్క శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని, ప్రధాని మోడి రాజీనామా చేయాలని, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని, జాతీయ మానవ హక్కుల కమిషన్‌, జాతీయ ఆదివాసీల కమిషన్‌ వెంటనే మణిపూర్‌లో పర్యటించాలని నాయకులు కోరారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బజరంగ్‌దళ్‌, వారి అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాలపై మూకమ్మడి దాడులు చేస్తూ చర్చిలను కూల్చివేస్తూ అనేక మందిని చంపేస్తూ భయభ్రాంతుల గురిచేస్తున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్వవహరిస్తోందని మండిపడ్డారు. ప్రముఖ న్యాయవాది వైకే, వివిధ సంఘాల నాయకులు జి.ఆర్‌ భగత్‌ సింగ్‌, జె.శ్రీనివాసరావు, జి.ప్రభుదాస్‌, యు.సాంబశివరావు పాల్గొన్నారు.