ప్రజాశక్తి సత్తెనపల్లి టౌన్ : మణిపూర్లో మహిళలపై అకృత్యాలు, మారణహోమానికి నిరసనగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ పిలుపు మేరకు స్థానిక కోర్టు వద్ద న్యాయవాదులు సోమవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్య చేస్తూ మణిపూర్ మహిళలపై అమానుష దమనకాండ దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో క్షీణించిన శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, భయంతో జీవిస్తున్న అక్కడ ప్రజలకు భరోసా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.లింగారెడ్డి, న్యాయవాదులు చిట్టా విజయభాస్కర్రెడ్డి, ఎన్.వేణుగోపాల్, డి.దస్తగిరి, ఎ.జయరామ్, బి.శ్రీనివాస్బాబు, సయ్యద్ అబ్దుల్ రహీమ్, బి.సంగీతరావు, కాజావలి పాల్గొన్నారు.










