Jul 27,2023 20:23

అంబేద్కర్‌ సర్కిల్‌లో నిరసన తెలుపుతున్న రాజకీయ, ప్రజాసంఘాలు

ప్రజాశక్తి-ఆలూరు
మణిపూర్‌ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం కాంగ్రెస్‌, సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిలో నిరసన చేపట్టారు. ర్యాలీగా తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహశీల్దార్‌ రామాంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ మాట్లాడారు. ఆదివాసీ కుకి తెగపై రెండు నెలలుగా జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, హింసాకాండకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఓట్ల కోసం మరోసారి బిజెపి రేపిన మతోన్మాద చిచ్చు మణిపూర్‌ ఘటన అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింసాకాండను నిలువరించక పోగా చోద్యం చూస్తూ బయటి ప్రపంచానికి తెలియకుండా ఇంటర్‌ నెట్‌ను కట్‌ చేసి మారణ హోమానికి కారకులయ్యాయని విమర్శించారు. ముగ్గురు కుకీ తెగకు సంబంధించిన మహిళలను పోలీసుల రక్షణ నుంచి లాక్కొని వివస్త్రలను చేసి వీధుల్లో ఊరిగించారని తెలిపారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేసిన మానవ మృగాలను అరెస్టు చేసి ఉరి తీయాలని కోరారు. ఆలూరు ఐక్య క్రైస్తవ సంఘం నాయకులు పాస్టర్‌ ఏసన్న, జాన్‌ వెస్లీ, విజరు కుమార్‌, శ్యామ్‌ బాబు, సిపిఎం నాయకులు ఈరన్న, వీరేష్‌, మైనా, గోవర్ధన్‌, విఠల్‌, ఎంఆర్‌పిఎస్‌ ఆలూరు తాలూకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు, హాలహర్వి మండల అధ్యక్షులు గూళ్యం ఎల్లప్ప, హోళగుంద మండల అధ్యక్షులు వెంకటేష్‌, ఆలూరు పట్టణ అధ్యక్షులు చంద్ర, గుంతకల్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అలాం నవాజ్‌, గాలి మల్లికార్జున, జిలాన్‌ బాష, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు ఉరుకుందప్ప, ఎస్సీ సెల్‌ చిప్పగిరి మండల అధ్యక్షులు ఖాజీపురం రాంబాబు, బాపురం వీరేష్‌, నవీన్‌, సంజప్ప, మహిళలు పాల్గొన్నారు.