Jul 27,2023 23:20

కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం: మణిపూర్‌లో మహిళలను నగంగా తిప్పడం సభ్య సమాజానికి అవమానకరమని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్‌.కిరషోర్‌కుమార్‌ అన్నారు. మణిపూర్‌లో మహిళలపై దారుణ ఘటనలు, మారణకాండను నిరసిస్తూ నగరంలోని డైమండ్‌ పార్కు నుంచి ఏడు రోడ్ల కూడలి వరకూ గురువారం కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'ఇది రెండు జాతుల మధ్య చిచ్చుపెట్టి అక్కడ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమకేమి తెలియదన్నట్లు నిమ్మకునీరేత్తినట్లు మౌనంగా ఉన్నారని అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమేనని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి తార్కాణమన్నారు, ఉద్దేశపూర్వంగ ప్రజలను రెచ్చగొట్టి అమానవీయ చర్యలకు పాల్పడుతుందన్నారు. ఈ ఆటవిక వికృత చేష్టలను ఆపాలని, లేకుంటే స్త్రీ మూర్తుల కన్నీటి కడలిలో కొట్టుకపోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సంఘీ భావంగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి పి.తేజస్వి, పోస్టల్‌ అసోసియేషన్‌ నాయకులు గణపతిరావు, యుటిఎఫ్‌ జిల్లా నాయకులు హెచ్‌.అన్నాజీరావు, పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్‌కుమార్‌, బి.రవికుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ఉమాశంకర్‌ పాల్గొన్నారు.