పెద్దవడుగూరు : ప్రజలు వివిధ సమస్యలపై అందించే అర్జీలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం పెద్దవడుగూరులోని టిటిడి కళ్యాణమండపంలో జగనన్నకు చెబుదాం మండల స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, డీఎల్డీవో శంకర్తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 149 అర్జీలను ప్రజలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో స్థానిక సమస్యలపై వచ్చిన ఆర్జీలను మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా సకాలంలో అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఒ అశోక్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నాగరాజ్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రూప్లనాయక్, ఆర్ఐఒ వెంకటరమణ నాయక్, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, స్పందన తహశీల్దార్ వాణిశ్రీ, తహశీల్దార్ నాగభూషణం, ఎంపిడిఒ కుళ్లాయిస్వామితో పాటు వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.










