కళ్యాణదుర్గం : వివిధ సమస్యలపై ప్రజలు అందించే అందించే అర్జీలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీటీ ఎకాలజీ సెంటర్లో జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందన అర్జీలకు గడువులోపు నాణ్యత కలిగిన పరిష్కారం చూపించాలన్నారు. ఎలాంటి పెండింగ్ ఉంచకుండా అర్జీలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో నిశాంత్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, డీఎల్డీవో శంకర్, డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, డీపీఒ ప్రభాకర్ రావు, డిఇఒ నాగరాజు, పీఆర్ ఎస్ఈ భాగ్యరాజ్, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశులు, తహశీల్దార్ ఫణికుమార్, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల పరిశీలన
కళ్యాణదుర్గం మండలంలోని తూర్పుకోడిపల్లి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని కలెక్టర్ గౌతమి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిబిరాల్లో ఓపి డేటా ఎంట్రీ అనేది అత్యంత ముఖ్యమన్నారు. శిబిరాల్లో రోగులకు మందులు లేవని చెప్పి పంపించేస్తున్నారని, మందుల పంపిణీ కేంద్రంలో ఫార్మసిస్టు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలన్నారు. శిబిరాలకు వచ్చిన వారికి నీళ్లు, మందులు అందించాలన్నారు. ఐసిడిఎస్ కింద అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రతి ఒక్కరికి పూర్తిగా వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఒ డా||ఈబి.దేవి, ఆర్డీవో నిశాంత్ రెడ్డి, డాక్టర్లు ఎస్.విజయేంద్ర, ప్రత్యూష, స్పెషలిస్ట్ డాక్టర్లు శివకుమార్, రూప, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఓబులమ్మ, తహశీల్దార్ ఫణికుమార్ పాల్గొన్నారు.










