ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యార్థులు మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రభుత్వ వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య, సిద్ధార్థ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ బి.వేణుగోపాల చారి తెలిపారు. మంగళవారం సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో కాన్వకేషన్ కార్యక్రమం నిర్వహించారు. 2015-18, 2016-19, 2017-20 సంవత్సరాల్లో సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కాన్వకేషన్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ బి.వేణుగోపాల చారి మాట్లాడారు. పూర్వ విద్యార్థులు వినయ, విధేయత, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని, ఇలాంటి బ్యాచ్లు మళ్లీ రావాలని కోరారు. కొంతమంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ... సిద్ధార్థ డిగ్రీ కళాశాల తమకు సంస్కారం, వినయ, విధేయతలు, జీవన అభివృద్ధికి విద్యా జ్ఞానాన్ని అందించిందని తెలిపారు. అనంతరం డాక్టర్ బాలయ్య మాట్లాడారు. విద్య ద్వారానే జ్ఞానాన్ని వృద్ధి చేసుకోగలమని, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఏదో ఒక రంగంలో విజయం సాధించాలని కోరారు. కాన్వకేషన్ సర్టిఫికెట్లను సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కమల సుజాత, ఎఎస్ డిగ్రీ కళాశాల వెంకట్రామిరెడ్డి, డాక్టర్ బాలయ్య, విజయ మహిళా మండలి డైరెక్టర్ ఓంకారప్ప పంపిణీ చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ వైద్యశాల రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య










