
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వ భూములు, బంజర్లు పేదలకు పంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ ఈఎస్ వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో భూ సదస్సుకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలను చైతన్య పరచి భూ పోరాటాలకు సన్నద్ధం చేసే విధంగా ఈనెల 13 న పెనుకొండలో భూ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భూ పంపిణీని నవరత్నాలలో చేర్చి దశరత్నాలుగా మార్చి ప్రభుత్వం బంజర్లు మిగులు భూములను పేదలకు పంచాలన్నారు. అసైన్డ్ చట్ట సవరణను రద్దుచేసి అన్నిక్రాంతమైన భూములను తిరిగి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. రైతుల భూములను బలవంతంగా సేకరించడం ఆపాలన్నారు. భూములు సేకరిస్తున్న చోట 2013 చట్ట చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేదల చేతుల్లో ఉన్న స్థలాలకు గుడిసెలకు పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. భూములకై పోరాడుతున్న పేదలపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 13న పెనుగొండలో నిర్వహించే భూ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ తదితరులు హాజరవనున్నారని తెలిపారు. ఈ సదస్సుకు పేదలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బ్యాళ్ల అంజి, సీనియర్ నాయకులు రామకృష్ణ, ముత్యాలు, ఫక్రుద్దీన్, పవన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.