ఏలూరు టౌన్ : విద్యుత్ పోరాట అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు, ప్రజా కళాకారుడు డాక్టర్ గరికపాటి రాజారావు వంటి మహనీయుల ఆశయ సాధన కోసం పనిచేయటమే వారికి నిజమైన నివాళులని పలువురు వక్తలు కొనియాడారు. శుక్రవారం ఉదయం స్థానిక ఆర్ఆర్ పేటలోని ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ జిల్లా కార్యాలయంలో అమర వీరుల వర్థంతి రజక వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పత్తిపాటి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. వారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ప్రతిజ్ఞ బూనారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, గొర్రెలు మేకల పెంపకం దారుల సహకార సంఘం అధ్యక్షులు ఆగోళ్ల వెంకట కృష్ణారావు, వడ్రం పనివాళ్ల సంఘం ఏలూరు నగర కార్యదర్శి కొత్తల శివకుమార్, సుందరయ్య గ్రంథాలయం నిర్వాహకులు కంది విశ్వనాథం, ప్రజాశక్తి బుక్ హౌస్ ఇంఛార్జి హరిప్రియ పాల్గొన్నారు.










