Jun 05,2023 21:06

బాధితులను పరామర్శిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆలూరు
హాలహర్వి మండలం కామినహాల్‌ గ్రామంలో తల్లి, కూతుళ్లపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సిపిఎం, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. సోమవారం ఆలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను నాయకులు పరామర్శించారు. గాయాలపాలైన బాధితులను సిపిఎం, సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పరామర్శించి సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్‌ నాయకులు కెపి.నారాయణ స్వామి మాట్లాడారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కామినహాల్‌ గ్రామంలో తల్లి, కూతుళ్లపై అదే గ్రామానికి చెందిన కొందరు అఘాయిత్యానికి ప్రయత్నించి కొడవళ్లతో దాడి చేశారని తెలిపారు. తల్లి, కూతుళ్లపై అఘాయిత్యానికి ప్రయత్నించి దాడికి పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకులు కృష్ణ, డివైఎఫ్‌ఐ నాయకులు మైనా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోవర్ధన్‌ పాల్గొన్నారు.