Jul 29,2021 18:54
మహిళల కోసం ఎపిలో 14 దిశ కేంద్రాలు

న్యూఢిల్లీ: హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబుస్తూ చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాలలో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని తెలిపారు. హింసకు గురై విపత్తును ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్‌ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందు ఉద్దేశంతో సమీకృత సేవలను అందించే విధంగా దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్ళు సేవలు అందించడం జరుగుతుందని, మహిళల సాధికారతను సాధించే విధంగా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్‌ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగిందని మంత్రి చెప్పారు.