ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలోని మహిళా సంఘం సభ్యులు చిన్న చిన్న వ్యాపారవేత్తలుగా, ఆర్ధికంగా అభివృద్ది చెందేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే అన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఏడు మండలాలకు సంబంధించిన వెలుగు ఏటీఎంలు, డిపిఎంలు, ఎపిడిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజన్సీలో మొదటి విడతలో 61, రెండో విడతలో 49 వందన్ వికాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు చేయించే విధంగా సర్వేలు పూర్తి చేయాలని, పూర్తి చేసిన సర్వే జాబితాలను అప్లోడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే రూ.15 లక్షల చొప్పున మంజూరవుతాయని తెలిపారు. ఏజెన్సీలోని 11 హాట్ బజార్ హబ్బులు ఏర్పాటు చేసి అటవీ ఉత్పత్తులు టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వెలుగు సంఘాల ద్వారా స్వీకరించిన ఆరు టన్నుల చింతపండును గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు, డిపిఎంలు అపర్ణ, పరమేశ్వర రావు, ఏపియంలు దుర్గాప్రసాద్, అప్పారావు, రాజు, శ్యాం కుమార్, జేమ్స్, మధు, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.










