ప్రజాశక్తి -భీమునిపట్నం : మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చిట్టివలస ఫుట్బాల్ గ్రౌండ్లో వైఎస్ఆర్ చేయూత పథకం కింద జివిఎంసి 1, 2, 3 వార్డులకు చెందిన 2,751 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.5.15 కోట్ల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు వైసిపి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించగా, నామినేటెడ్ పదవుల్లో కూడా ఎక్కువ శాతం అవకాశాలు కల్పించారని తెలిపారు. ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి సమతుల్యంగా చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 1,4 వార్డుల కార్పొరేటర్లు అక్కరమాని పద్మ, దౌలపల్లి కొండబాబు, కో-ఆప్షన్ సభ్యులు కొప్పల ప్రభావతి, తహసీల్దార్ కోరాడ వేణుగోపాల్, జోనల్ కమిషనర్ ఎస్.వెంకటరమణ, యుసిడి ఎపిడి ఎల్.రాము, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు, ఎపి పద్మశాలి కార్పొరేషన్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ డైరెక్టర్ తమ్మిన రామ లక్ష్మణరావు, మాజీ కౌన్సిలర్లు కొప్పల రమేష్, జగుపిళ్ల ప్రసాద్, ఉప్పాడ నాగేశ్వరరావు, జివి.రమణ, నాయకులు ఎస్ సరళారాణి, కరుణాకర రెడ్డి, జీరు వెంకటరెడ్డి, తమ్మిన అశోక్, ఎస్.ప్రసన్న, శివ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు.










