Nov 03,2023 21:16

మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రమా

ప్రజాశక్తి - మంత్రాలయం
ఓటరు జాబితాలో మహిళా ఓటర్లపై మళ్లీ సర్వే జరగాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రమా అధికారులను ఆదేశించారు. శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితా ప్రకారం మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారని తెలిపారు. దానిపై దృష్టి సారించాలని కోరారు. గ్రామాల్లో మహిళలు పెళ్లయి మెట్టినింటికి వెళ్లినా పేర్లు తొలగించకుండా ఉండొచ్చని సూచించారు. సమగ్రంగా సర్వే జరగాలని, లేకపోతే బిఎల్‌ఒలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రక్షాళనతో సరైన ఓటరు జాబితా తయారీకి సహకరించాలని కోరారు. కౌతాళం, పెద్దకడబూరు తహశీల్దార్లు గైర్హాజరు కాగా కోసిగి తహశీల్దార్‌ రుద్రగౌడు, డిప్యూటీ తహశీల్దార్లు శశిశేఖర్‌, రాఘవేంద్ర, బిఎల్‌ఒలు పాల్గొన్నారు.