Oct 24,2023 20:00

విజ్జి స్టేడియంలో ముంబాయి, బరోడా జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అండర్‌ 19 మహిళా వన్డే సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మహారాష్ట్ర, ముంబాయి జట్లు విజయం సాధించాయి. మంగళవారం విజ్జి స్టేడియంలో ముంబాయి, బరోడా జట్లు మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బరోడా జట్టు బ్యాటింగ్‌ చేసింది. 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. ముంబాయి బౌలర్లలో నిమిట్‌ రానే 3, డ్మెల్లో 2 వికెట్లు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ముంబాయి జట్టు 48 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ముంబాయి బ్యాటింగ్‌లో హార్లే 64, సాద్వి సంజరు 64 పరుగులు చేశారు. ముంబాయి రెండు వికెట్లు తేడాతో విజయం సాధించింది.
40 పరుగులు తేడాతో మహారాష్ట్ర జట్టు విజయం
స్థానిక చింతలవలస పివిజి రాజు క్రికెట్‌ అకాడమీలో మహారాష్ట్ర, తమిళనాడు జట్లు మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలుత మహారాష్ట్ర జట్టు బ్యాటింగ్‌ చెయ్యగా 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 229 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు జట్టు 45.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. దీంతో 26 తేదీన చింతలవలస పివిజి రాజు క్రికెట్‌ అకాడమీలో జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబాయి, మహారాష్ట్ర జట్లు తలపడనున్నాయి.