Nov 03,2023 20:22

సంఘీభావం తెలుపుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27, 28న విజయవాడలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని వక్తలు కోరారు. శుక్రవారం ఆదోనిలోని రిక్రియేషన్‌ క్లబ్‌లో ఎఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకన్న అధ్యక్షతన కార్మిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్‌లుగా విభజించడం వల్ల కార్మికలకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. చలో విజయవాడలో కార్యాచరణ రూపొందించి దశలవారీ ఆందోళనలకు సిద్ధమవుతామన్నారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కె.అజరు బాబు, ఐఎన్‌టియుసి జిల్లా నాయకులు దేవిశెట్టి ప్రకాష్‌, రైతుసంఘం జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, లక్ష్మన్న, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు ఎంకప్ప, రైతు కూలీ సంఘం నాయకులు మల్లికార్జున, ఐఎఫ్‌టియు పట్టణ కార్యదర్శి చెన్నకేశవులు, ఎఐటియుసి ఒబి.నాగరాజు, కల్లుబావి రాజు, ప్రకాష్‌ పాల్గొన్నారు.