
- ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి-రంపచోడవరం, అడ్డతీగల
ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం వై రామవరం మండలం చవిటిదిబ్బ వాడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, పందిరి మామిడి నుండి చవిటిదెబ్బలు ఆర్ అండ్ బి రోడ్డును ప్రాజెక్ట్ అధికారి ఆలస్మికంగా పర్యటించి పరిశీలించారు. ముందుగా చవిటిదిబ్బలు, వాడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రాజెక్ట్ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ సూరజ్ గనోరే మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జ్వరాలతో వచ్చిన రోగులకు వెంటనే రక్త నమోనాలు స్వీకరించి ఆయా వ్యాధులకు మందులు అందజేయాలని సూచించారు. ఏజెన్సీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. పందిరి మామిడి నుండి చవిటి దిబ్బలు రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని, రహదారుల నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను పిఒ ఆదేశించారు. ప్రాజెక్ట్ అధికారి వెంట రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సాయి సతీష్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.