
ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో మెప్మా ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. మెప్మా ఉద్యోగుల సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సుజాత, సత్యవతి, అన్నపూర్ణ, సిఐటియు జిల్లా నాయకులు జి.వెంకటరమణ, ఇందిర, బి.సూరిబాబు మాట్లాడారు. మెప్మా ఆర్పిలకు కాల పరిమితి సర్క్యులర్ 64ను రద్దు చేయాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రేడింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. పది లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సిఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అనంతరం డిఆర్ఒ జె.వెంకట్రావుకు వినతిపత్రాన్ని అందించారు. ప్రభుత్వానికి ఆర్పిల సమస్యలపై లేఖ రాస్తానని ఆయన హామీఇచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మంగమ్మ, భాగ్యలక్ష్మి, గౌరీ, అరుణ, దేవి, హేమలత, తదితరులు పాల్గొన్నారు.