ప్రజాశక్తి-జగ్గయ్యపేట: జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంతో పాటు మేటి పట్టణంగా జగ్గయ్యపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. స్థానిక చెరువు బజార్లోని ఊర చెరువు అభివృద్ధి పనులు, నీటి శుద్ధీకరణ పనులు, ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మొదటగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలోని చెరువును సుందరీకరిస్తున్నామన్నారు. దానిలో భాగంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, గ్రీనరీ, బోటు షికారు, లైటింగ్ తదితర హంగులతో సుందరవనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్లు తుమ్మల ప్రభాకర్, హఫీజున్నిసా, స్థానిక కౌన్సిలర్ తన్నీరు నాగేంద్ర నాగమణి, అల్ట్రాటెక్ సిమెంట్స్ యూనిట్ హెడ్ డాక్టర్ కె.శ్రీధర్, హెచ్ఆర్ హెడ్ ఏవీఎన్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










