ప్రజాశక్తి-పాడేరు: పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాలు ఈ ఏడాది మే 14, 15, 16 తేదీలలో నిర్వహించనున్నట్లు పాడేరు ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్పర్సన్ కొట్ట గుల్లి భాగ్యలక్ష్మి వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో పుర ప్రముఖులు గ్రామ పెద్దలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, భక్తులతో బుధవారం సాయంత్రం ఆలయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఏడాది పాడేరులో మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. మే 12న అమ్మవారి జయంతి రోజు పండగ మొదలుకొని 14, 15, 16 తేదీల్లో జాతర మహౌత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, భక్తులు, ఉద్యోగ వ్యాపార వర్గాలు తమ సహాయ సహకారాలను అందించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ టి.నరసింగరావు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటగుల్లి సింహాచలం నాయుడు, మాజీ మంత్రి మణి కుమారి, పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్ కొట్టగుల్లి ఉషారాణి, వైస్ సర్పంచ్ బూరెడ్డి రాము, వైస్ ఎంపీపీ గంగ పూజారి శివ, ఆలయ కమిటీ నాయకులు సభ్యులు ఆధ్యాత్మిక సేవా బృందం సభ్యులు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సవ కమిటీ ఏర్పాటు.
పాడేరు : మే 14 నుంచి 16 వరకు పాడేరులో నిర్వహించే మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాల నిర్వహణకు బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని నియమించారు. మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవం ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్య దొర, ప్రధాన కార్యదర్శులుగా తమర్భ ప్రసాద నాయుడు, నవర కొండబాబు, కార్యదర్శులుగా యాదగిరి శ్రీనివాసరావు, లకే నాని పాత్రుడు, బిక్కవోలు రాంబాబు, బోణంగి వెంకట రమణ, మగాపు సత్య మోహన్ ఎన్నికయ్యారు.










