ప్రజాశక్తి - భవానీపురం
మద్యం, గంజాయి వంటి అనేక మత్తు పదార్ధాలను నియంత్రించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు కుండనాల శేషుమణి, కార్యదర్శి గాదె ఆదిలక్ష్మి బుధవారం భవానీపురం పోలీస్ స్టేషన్ సి.ఐ. ఎం.డి. ఉమర్కు వినతిపత్రం అందజేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 44వ డివిజన్లో మహిళల్ని, స్కూల్ పిల్లల వెంటపడి వేధిస్తున్న అల్లరి మూకల నుండి రక్షణ కల్పించాలని, మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను గుట్టుచప్పుడు గాకుండా అమ్ముతున్న వారిపై గట్టి నిఘా పెట్టి వారిని నియంత్రించి, తగు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్ పరిధిలోని జిఎనఆర్ఎంసి హైస్కూల్ నుండి కెసి హైస్కూల్ వరకూ, కొండబడి, రామరాజ్యనగర్ మర్రిచెట్టు సెంటర్, సాయిబాబా గుడి మొదలగు ప్రాంతాల్లో అల్లరి మూకలు గ్రూఫులు గ్రూఫులుగా సెల్ఫోన్స్ పట్టుకుని జనసంచారం తక్కువగా ఉన్న ఏరియాల్లో నిలిపివున్న ఆటోల్లో కూర్చుని దారినపోయే మహిళలను, స్కూల్ పిల్లలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని తెలిపారు. స్కూల్ వదిలే సమయానికి దారి కాస్తున్నారని, స్టడీ అవర్స్ పూర్తి అయ్యే సమయానికి చీకటి పడుతుండటంతో ఆడపిల్లలు ఇంటికి రావాలంంటే భయపడుతున్నారని సిఐకు ఇచ్చిన వినతిపత్రంలో ఐద్వా నాయకులు పేర్కొన్నారు. మద్యం, మత్తు పదార్ధాలు సేవించి రాత్రి ఒంటి గంట వరకూ ఆర్ఆర్ నగర్, సాయిబాబా గుడి, మర్రిచెట్టు సెంటర్లలో అరాచకాలు సృష్టిస్తున్నారని, ఇదేమని అడిగిన వారిపై దాడులు చేస్తున్నా రని తెలిపారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేవిధంగా అవసరమైన చోట్ల సిసి కెమెరాలను ఏర్పాటుచేసి, ప్రజలకు రక్షణ కల్పిం3ాలని సిఐ ఉమర్కు ఐద్వా నాయకులు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా పశ్చిమ సిటీ అధ్యక్ష కార్యదర్శులు కె. శేషుమణి, గాదె ఆదిలక్ష్మి, ఆఫీస్ బేరర్స్ విక్రం లక్ష్మి,, బి. పరమేశ్వరీ, వి. సుజన, స్వప్న పాల్గొన్నారు.










