Feb 27,2023 00:25

మద్యం షాపునకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న స్థానికులు

ప్రజాశక్తి - ఆరిలోవ : కేంద్రకారాగారం ఎదురుగా గల రామకృష్ణాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణం వద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. 13వ వార్డు పరిధి రామకృష్ణాపురం కాలనీలో నివాసాల మధ్య ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటుకు ఏర్పాట్లు చేసింది. మద్యం షాపు ఏర్పాటు చేయబోయే షెడ్డు ముందు గ్రామస్తులందరూ ఏకమై ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మద్యం షాపునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. నగర శివారు ప్రాంతం కావడంతో ఇప్పటికే గంజాయి బ్యాచ్‌లతో ఇబ్బందులు పడుతున్నామని, దీనికి తోడు మద్యం షాపు ఏర్పాటు చేస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ కాలనీలో అందరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేస్తే తమ బ్రతుకులు మరింత నాశన మవుతాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మద్యం షాపు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకుంటే నిరవధిక పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలో స్థానిక సంఘం నాయకులు వంకర బాబూరావు, కాకర గోవిందు తదితరులు పాల్గొన్నారు.