Nov 15,2023 22:37

లావేరు మండలం కొత్తకుంకాం వద్ద తవ్వి వదిలేసిన కాలువలు

* తాత్కాలికంగా ఆగిన రెండో దశ
* కాలువ తవ్వకాలకు రాని మైనింగ్‌ అనుమతులు
* స్ట్రక్చర్ల నిర్మాణాలకు ముందుకు రాని నిర్మాణ సంస్థ
* జనవరి నాటికి పూర్తి కావడంపై సందేహాలు
      మడ్డువలస రెండో దశ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌లు పడ్డాయి. పొందూరు మండలంలో పలు ప్రాంతాల్లో బండరాళ్ల తొలగింపునకు మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో, కాలువ తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు పనులు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌ పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా పనులు ముందుకు సాగకపోవడానికి మరో కారణంగా ఉంది. కాలువ తవ్వకాలకు అధికారులు భూమిని సేకరించినా, రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం పనులు ఆగిపోవడానికి దారితీసింది. ప్రస్తుతం చేపట్టిన పనులు పరిశీలిస్తే నిర్దిష్ట సమయానికి పూర్తి కావడంపై అనేక సందేహాలు నెలకొన్నాయి.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
మడ్డువలస జలాశయ రెండో దశ పథకాన్ని నిర్మించాలని 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 6, 2009లో రూ.57.87 కోట్లకు పరిపాలనా ఆమోదం కూడా తెలిపింది. జి.సిగడాం, పొందూరు, లావేరు, ఎచ్చెర్ల, మండలాల్లోని 24,954 ఎకరాలకు సాగునీందించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీంతో మొత్తం 21 గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. పథక నిర్మాణ బాధ్యతలను విశాఖపట్నానికి చెందిన పి.జె.ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ టెండర్లలో రూ.47.3933 కోట్లకు దక్కించుకుంది. మార్చి 2, 2009న ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పనిని 24 నెలల కాలంలో పూర్తి చేయాల్సి ఉంది. అంటే మార్చి 2, 2011 నాటికే పనులు పూర్తయి రైతులకు సాగునీరు అందించాల్సి ఉంది. ఒప్పంద కాలపరిమితులు పొడిగిస్తూ ప్రభుత్వం వరుసగా ఆరు పర్యాయాలు అవకాశమిచ్చింది. చివరిసారిగా కాలపరిమితిని జూన్‌ 30, 2018 వరకు పొడిగించింది. అధికారిక లెక్కల ప్రకారం 78.36 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 21.64 శాతం పనులు మిగిలి ఉన్నాయి. ఒప్పందం విలువ రూ.47.393 కోట్లలో రూ.37.14 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం సంబంధిత నిర్మాణ సంస్థ పనులు నిలుపుదల చేసింది. దీంతో ప్రభుత్వం జూలై 8, 2020లో సంబంధిత నిర్మాణ సంస్థతో ఒప్పందాన్ని ముగించింది.
కొత్త నిర్మాణ సంస్థకు పనులు అప్పగింత
రిజర్వాయర్‌ పనులు చేపట్టిన పిజెఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ ఇప్పటివరకు 78.36 శాతం మేర పనులు పూర్తి చేసి వైదొలగింది. మిగిలిన 21.64 శాతం పనులు చేసేందుకు కొత్త నిర్మాణ సంస్థకు పనులు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇంజినీరింగ్‌ అధికారులు మిగిలిన పనులకు కొత్త రేట్లకు అనుగుణంగా అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలిపి రూ.26.90 కోట్లను మంజూరు చేస్తూ 2022 ఏప్రిల్‌ 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. స్టేజ్‌-2లో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బిఎన్‌బి ఇన్‌ఫ్రా ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.23.83 కోట్లతో టెండర్లను దక్కించుకుంది.
జనవరికి పూర్తి కావడం సందేహమే
మడ్డువలస పనులు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్‌ నిరాసక్తత కనబరుస్తున్నట్లు తెలిసింది. బిల్లులు వస్తాయో లేదోనన్న సందేహంతో వెనుకడుగు వేస్తుండడంతో, పనులు ముందుకు సాగడం లేదు. పది కిలోమీటర్ల మేర కాలువ తవ్వాల్సి ఉండగా, నాలుగు కిలోమీటర్లు తవ్వారు. కాలువపై 250 స్ట్రక్చర్లు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్కటీ నిర్మించలేదు. కొత్తగా పనులు మొదలైన తర్వాత ఐదు శాతం మాత్రమే పూర్తయ్యాయి. కొత్త ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలోగా పనులు పూర్తి కావాల్సి ఉంది. పనులు జరుగుతున్న పరిస్థితి చూస్తే ఆరు నెలల పాటు పొడిగించాల్సి వస్తుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
అడుగడుగునా అవాంతరాలే...
మడ్డువలస పనులను 2009లో ప్రారంభించి 2020 జూలై వరకు 78.36 శాతం జరిగాయి. రెండో దశ పూర్తి కావాలంటే మరో 21.64 శాతం పనులు పూర్తి చేయాలి. మిగిలిపోయిన పనులను ప్రభుత్వం కొత్త నిర్మాణ సంస్థకు పనులు అప్పగించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 24న మడ్డువలస పున:ప్రారంభ పనులకు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. అప్పట్నుంచి మొదలైన పనులు మందకొడిగానే సాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు పనులకు రకరకాల ఆటంకాలు కలుగుతున్నాయి. పొందూరు మండలం విఆర్‌ గూడెం, ధర్మపురం, వావిలపల్లిపేట, ప్రాంతాల్లో కాలువ తవ్వకాలకు బండరాళ్లు అడ్డు రావడంతో వాటిని పేల్చి తొలగించాల్సి ఉంది. మైనింగ్‌ శాఖకు దరఖాస్తు చేసినా ఇంకా అనుమతులు ఇవ్వలేదు. రైతుల నుంచి తీసుకున్న భూములకు రూ.2.25 కోట్లను చెల్లించకపోవడంతో కాలువ తవ్వకాలు ఆగిపోయాయి.