పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్యపంటలు, పండ్లు, కూరగాయలు తదితరాలను ఎక్కువగా పండించాలని, ఆ పంటలకు అధికధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్ లోని రైతులను ఆహారపంటలు పండించటం నుండి దూరం చేసి, వాణిజ్యపంటలు పండించేలా చేసి, వారిని అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల లోకి లాగి దివాళా తీయించటం, దేశంలో ఆహారకొరత ఏర్పడేలా చేసి, ఆహార సరఫరాదారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచుకోవచ్చుననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం.
ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ నెల 8వ తేదీన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటి 2021-22 ఖరీఫ్ సీజన్లో 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. కమిటీ ప్రకటించిన ధరలతో వ్యవసాయ ఖర్చులు పోనూ రైతుల కనీస ఆదాయం 50 శాతం అదనంగా పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని ప్రకటనలో పేర్కొన్నారు. కనీస మద్దతు ధరలను గురించి ఎవరూ ఏ విధమైన పొరపాటు అభిప్రాయాలతో ఉండవద్దని, కనీస మద్దతు ధరలు, వాటి పెంపుదల ఎప్పటికీ ఉంటాయని వ్యవసాయశాఖ మంత్రి పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ప్రభుత్వం వివిధ పంటలకు ప్రకటించిన ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయి. మద్దతు ధరలు, వ్యవసాయోత్పత్తుల సేకరణపై రైతాంగం చేస్తున్న డిమాండ్లను, మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం పది మాసాల నుండి దేశవ్యాపితంగా రైతాంగం చేస్తున్న పోరాటాలను పరిగణన లోకి తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి ఏకపక్షంగా నిర్ణయించిన ధరలు రైతాంగానికి ఏ మాత్రం మేలు చేయవు.
వరి ధాన్యానికి 2020-21లో కనీస మద్దతు ధర గ్రేడ్ 'ఎ' కు క్వింటాలుకు 1,888 రూపాయలుగా నిర్ణయించగా, 2021-22లో 1960 రూపాయలకు-72 రూపాయలు-పెంచారు. సాధారణ రకానికి క్వింటాలుకు 1,868 రూపాయల నుండి 1940 రూపాయలకు-72 రూపాయలు-పెంచారు. గత సంవత్సరం కన్నా గ్రేడ్ 'ఎ' రకానికి 3.8 శాతం, సాధారణ రకానికి 3.9 శాతం పెంచారు. గోధుమలకు పెంపుదల మరింత తక్కువగా ఉంది. 2020-21లో గోధుమ క్వింటాలుకు 1925 రూపాయలు కనీస మద్దతు ధరగా నిర్ణయించగా, 2021-22లో 1975 రూపాయలుగా నిర్ణయించారు. పెంపుదల 2.5 శాతం మాత్రమే. గత సంవత్సరం కన్నా అత్యధికంగా నువ్వులకు క్వింటాలుకు 452 రూపాయలు (6.6 శాతం) పెంచారు. తర్వాత కందులు, మినుములకు 300 రూపాయల చొప్పున (5 శాతం) పెంచారు. వేరుశనగ, పొద్దు తిరుగుడు గింజలకు 275, 235 రూపాయల చొప్పున 5.2, 2.2 శాతం చొప్పున పెంచారు. ఈ విధంగా కొన్ని పంటలకు ఎక్కువగా ధరలు పెంచటం రైతాంగాన్ని ఆ పంటలను పండించే విధంగా ప్రోత్సహించటం కోసమేనని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.
దేశంలో పండించే పంటలలో వరి, గోధుమ ప్రధానమైనవి. ప్రభుత్వం ఈ పంటలనే అధికంగా సేకరిస్తుంది. ప్రభుత్వం సేకరించని పంటలకు మద్దతు ధరలను ప్రకటించినా వాటిలో ఎక్కువ భాగం కాగితాలపై ఉండటం మినహా రైతాంగానికి ఉపయోగపడవు. ప్రభుత్వం గోధుమలకు క్వింటాలుకు 2.5 శాతం, వరి ధాన్యానికి 3.8 శాతం చొప్పున పెంచగా, ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉంటుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నపుడు గోధుమలకు 2.5 శాతం, వరి ధాన్యానికి 1.1 శాతం తక్కువగా ధరలు నిర్ణయించినట్లు స్పష్టమౌతున్నది. వాస్తవంగా ద్రవ్యోల్బణాన్ని పరిగణన లోకి తీసుకొని, అంతకన్నా అధికంగా మద్దతు ధరలు పెంచితే అదనంగా పెంచానని చెప్పుకోవటానికి అవకాశం ఉండేది. కాని కనీసం పెంచాల్సిన ధరల కన్నా తక్కువ నిర్ణయించి ఖర్చులకు అదనంగా 50 శాతం వచ్చేలా తాము రైతుల ఆదాయాన్ని పెంచామని చెప్పుకోవటం ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని వెల్లడిస్తున్నది.
యాభై శాతం అదనపు ఆదాయం కల్పిస్తున్నారా ! ?
రైతులకు తాము పండించిన పంటలకు అయిన ఖర్చులన్నీ పోనూ 50 శాతం అదనపు ఆదాయం వచ్చేలా ధరలు నిర్ణయించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2+ఎఫ్.ఎల్ కు అదనంగా 50 శాతాన్ని ప్రాతిపదికగా తీసుకొంటున్నామని చెబుతున్నది. రైతాంగం సి2+50 శాతం విధానం ప్రాతిపదికగా వ్యవసాయోత్పత్తుల ధరలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నది. సి2+50 విధానంలో మొత్తం వ్యవసాయ ఖర్చులతో పాటు వడ్డీలు, కౌలు, కుటుంబ శ్రమను కూడా పరిగణన లోకి తీసుకొని పంటలకు అయిన వ్యయాన్ని నిర్ణయిస్తారు. ఎ2+ఎఫ్.ఎల్ లో పెట్టుబడులు, కుటుంబ శ్రమను మాత్రమే పరిగణన లోకి తీసుకొని వ్యయాన్ని లెక్కిస్తారు. కాని వాస్తవంగా ప్రభుత్వం ఎ2+ఎఫ్.ఎల్ ను ప్రాతిపదికగా తీసుకోవటంలో కూడా మోసపూరితంగా వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను కొద్దిమేరకు పెంచి, 50 శాతం అదనంగా నిర్ణయించామని చెబుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలించినట్లైతే నువ్వులు, మినుములు, కందులు, వేరుశనగకు మాత్రమే 5 శాతం, అంతకన్నా ఎక్కువగా పెరచారు. ద్రవ్యోల్బణం 5 శాతం ఉన్నపుడు ఇది నామకార్ధపు పెరుగుదల మాత్రమే. మిగతా పంటలకు వాస్తవంగా గత సంవత్సరం కన్నా తక్కువ ధరలు నిర్ణయించినట్లుగా స్పష్టమౌతున్నది. అసలుకే తక్కువ ధరలు నిర్ణయించినపుడు ఇక 50 శాతం అదనంగా ఇవ్వటం ఎక్కడీ
ప్రభుత్వం తానుగా ప్రజలపై వేస్తున్న భారాలు రైతులు, వ్యవసాయ రంగం పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం పెట్రోలు, డీజిలు ధరలనను మూడోవంతుకు పైగా పెంచింది. సాధారణ రైతులు కూడా వ్యవసాయంలో వచ్చిన మార్పుల దృష్టా మోటారు సైకిల్ వాడకం తప్పనిసరైంది. చాలా ప్రాంతాలలో వ్యవసాయ మోటార్లకు డీజిలు వినియోగిస్తున్నారు. వారు ఈ భారాన్నంతా భరించాల్సి వస్తున్నది. విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించమని కేంద్రం ఒత్తిడి చేయటంతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్లకు మీటర్లు బిగిస్తున్నాయి. దానిలో ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వం ముందెత్తున వున్నది. మీటర్లెందుకు బిగిస్తున్నారంటే రైతులపై ఏ మాత్రం భారం ఉండదు. విద్యుత్ వ్యయాన్నంతా ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుంది. రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని, వారిపై ఒక్క రూపాయి కూడా భారం ఉండదని చెబుతున్నారు. రైతులపై నిజంగా భారం వేసే ఉద్దేశ్యమే లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, మీటర్లు బిగించటం ఎందుకు? ఇదే విధంగా గతంలో ప్రభుత్వం వంటగ్యాస్ సరఫరా చేసే కంపెనీలకు చెల్లిస్తున్న సబ్సిడీని వినియోగదారుల ఎకౌంట్లలో జమ చేస్తానని, ముందు వినియోగదారులు మొత్తం ఖరీదు చెల్లించి వంటగ్యాస్ను కొనుగోలు చేయాలని చెప్పింది. ఆ విధంగా మార్చిన తర్వాత అనేకమంది ఎకౌంట్లలో సబ్సిడీ జమ కాలేదు. 2020 నుండి మొత్తం సబ్సిడీని రద్దు చేశారు. వ్యవసాయ విద్యుత్కు కూడా ఆ విధంగా ప్రభుత్వం చెల్లించటం మానేస్తే బిల్లుల చెల్లింపు భారాన్ని రైతులు భరించలేరు. కేంద్రం పంటల ధరలను నిర్ణయిస్తున్నపుడు ఈ విధంగా పెరుగుతున్న భారాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు.
వాణిజ్య పంటల వైపుకు మళ్ళించే యత్నం
పంటలకు ధరలు నిర్ణయించిన విధానం రైతాంగాన్ని ఆహారపంటల నుండి ఇతర పంటల వైపు మళ్ళించటం లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వాణిజ్య పంటలు, పండ్లు, కూరగాయలు తదితరాలను ఎక్కువగా పండించాలని, ఆ పంటలకు అధిక ధరలు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. భారత్ లోని రైతులను ఆహారపంటలు పండించటం నుండి దూరం చేసి, వాణిజ్య పంటలు పండించేలా చేసి, వారిని అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల లోకి లాగి దివాళా తీయించటం, దేశంలో ఆహారకొరత ఏర్పడేలా చేసి, ఆహార సరఫరాదారులుగా దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై తమ పెత్తనాన్ని పెంచుకోవచ్చుననేది సామ్రాజ్యవాద దేశాలు, బహుళజాతి కంపెనీల వ్యూహం. దీనిలో దేశంలోని కార్పొరేట్ కంపెనీలకు కూడా ప్రయోజనం ఉన్నది. అందువలన బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి దీనిని ముందుకు తీసుకుపోవటానికి ఒత్తిడి చేస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలలో భాగమైన ఈ వ్యవసాయ విధానాన్ని అమలు చేయమని రైతులపై మోడీ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి.
వాణిజ్య పంటలు పండించమని రైతాంగాన్ని ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వాలు పంటలు మార్కెట్లోకి వచ్చి ధరలు పడిపోయినపుడు రైతాంగాన్ని ఆదుకోవటానికి, వారికి కనీస మద్దతు ధరలు ఇప్పించటానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. గత సంవత్సరం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ధాన్యం, పత్తి, ఇతర వాణిజ్య పంటలు మార్కెట్లోకి వచ్చినపుడు వ్యాపారులు ధరలు దిగ్గోసి కోనుగోలు చేశారు. ఆ సందర్భంలో ప్రభుత్వాలు మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వాలు నామమాత్రపు కొనుగోళ్ళతో కంటి తుడుపు చర్యలు తీసుకున్నాయి మినహా మార్కెట్లోకి వచ్చిన ధాన్యం, వాణిజ్య పంటలను కొనుగోలు చేసి, రైతాంగానికి మద్దతు ధరలు అందించటానికి ప్రయత్నం చేయలేదు. ఇటువంటి పరిస్థితులలో రైతాంగాన్ని మరింతగా వాణిజ్య పంటల వైపు మళ్ళించటమంటే వారిని మరింతగా మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలివేయటమే అవుతుంది. అటువంటి స్థితిలో రైతాంగం మరింతగా మార్కెట్ ఒడిదుడుకులకు గురై కనీస మద్దతు ధరలు పొందలేకపోవటం, అప్పులపాలు కావటం, ఆత్మహత్యలు పెరగటానికి దారితీస్తుంది. అందువలన ప్రభుత్వం మద్దతు ధరలపై అసత్య ప్రచారాన్ని కట్టిపెట్టి, రైతాంగం డిమాండ్ చేస్తున్న విధంగా సి2+50 శాతం ప్రాతిపదికగా అన్ని పంటలకు మద్దతు ధరలను నిర్ణయించి, సీజన్ ప్రారంభం కాగానే రైతాంగం నుండి మద్దతు ధరలకు పంటలను కొనుగోలు చేయటానికి పూనుకోవాలి. ఆహార ధాన్యాలు పండించే భూమి, ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గకుండా, మన దేశ ఆహార భద్రత దెబ్బతినని విధంగా వ్యవసాయ విధానాలు రూపొందించాలి.
ఎ. కోటిరెడ్డి











