Jan 22,2023 23:09

ధర్నా చేస్తున్న రజక వృత్తిదారులు

ప్రజాశక్తి -కంచరపాలెం : దోబీఘాట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ జివిఎంసి 56వ వార్డు పరిధి పైడిమాంబ కాలనీ వద్ద కె.లక్ష్మి ఆధ్వర్యాన రజకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో సుమారు 30 కుటుంబాలు రజక వృత్తి చేస్తూ జీవిస్తున్నారని తెలిపారు. రజకులు వృత్తి చేసుకునేందుకు దోబీ ఘాట్లు నిర్మించాలని, ఉచిత కరెంటు, షెడ్లు, మోటార్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. రజకుల లాండ్రీలకు జగనన్న చేదోడు పథకం వర్తింప చేయాలని, దోబీఘాట్లకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని, రజకుల వృత్తి స్థలాలను పిఒపిలో చేర్చి పూర్తి హక్కు కల్పించాలని, రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 30వ తేదీన విజయవాడలో నిర్వహించే చేతి వృత్తిదారుల సదస్సులో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె.ఉమ, ఆర్‌.వర్మ, కె.మంగ, పి.సింహాలక్ష్మి, కె.పెంటమ్మ, పరదేశిరావు పాల్గొన్నారు.