Feb 27,2023 21:46

ప్రజాశక్తి - చింతలపూడి
                  వైఎస్‌ఆర్‌ కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు సోమవారం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం తహశీల్దార్‌ కృష్ణజ్యోతి, నగరపంచాయతీ కమిషనర్‌ ఎన్‌.రాంబాబులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 2006లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో 200 కుటుంబలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అప్పటి నుంచి దాదాపు 16 సంవత్సరాలు అయినా కాలనీలో కనీస వసతి సౌకర్యాలు కల్పించలేదన్నారు. కనీసం వీధిలైట్లు, డ్రెయినేజీ వ్యవస్థ లేవని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌ కాలనీ రోడ్డు ఆక్రమణకు గురైందని, తమ రోడ్డు తమకు అప్పగించాలని కోరారు. డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి వస్తుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమ ంలో నరేష్‌, నాగేశ్వరరావు, కాలనీవాసులు పాల్గొన్నారు.