Aug 30,2023 21:43

మైనార్టీల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు గఫూర్‌

 కడప అర్బన్‌ : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు. బుధవారం సిపిఐ బస్సు యాత్ర కడపకు చేరుకున్న సందర్భంగా ముస్లిం మైనార్టీ ఫంక్షన్‌ హాలులో ముస్లిం మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం పేద జంటలకు ఇచ్చే షాదీతోఫా షరతులతో ఇస్తున్నారని విమర్శించారు. విద్యను దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టాప్‌ 100 యూనివర్శిటీలలో సీటు తెచ్చుకుంటేనే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రామ కృష్ణ కళాశాల వద్దనున్న వక్ఫ్‌ స్థలం సజ్జల రామకృష్ణారెడ్డ్డి ఆధీనంలోకి వెళ్లిపో యిందని తెలిపారు. ముస్లిం మైనార్టీ పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్‌ సిబ్లి మాట్లాడుతూ దుల్హన్‌ పథకం ద్వారా టిడిపి ప్రభుత్వం రూ.50వేలు ఇచ్చేదని తెలిపారు. జగన్‌ రూ. లక్ష ఇస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పారు. తాను కోర్టు వెళ్లి జడ్జిమెంట్‌ వచ్చే సమయంలో జిఒ తెచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓబులేసు, టిడిపి కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జీ అమీర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నజీర్‌ అహమ్మద్‌, జెఎసి కన్వీనర్‌ బాబుబారు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి ఫరూక్‌, ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.