మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా, ఎవరైనా సహకరించినా చర్యలు తప్పవు
మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా, ఎవరైనా సహకరించినా చర్యలు తప్పవు
పదవ తరగతి పరీక్ష కేంద్రాలవద్ద బందోబస్తూ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడినా వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. రఘు వీర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం జిల్లా ఎస్పీ నంద్యాల పట్టణంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా నంద్యాల పట్టణంలోని ఎస్పీజీ స్కూల్ ,గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్,గెలివి స్కూల్,నెరవాటి ఇంగ్లిష్ మీడియం స్కూల్,మున్సిపల్ హైస్కూల్ ఎన్ జి ఓస్ ‘ కాలనీ లోని పలు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,సిబ్బందికి పలు సూచనలు,సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా వ్యాప్తంగా 125 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని అన్నీ పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు తీసుకున్నామని,పరీక్ష కేంద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని,పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్స్, ఐపాడ్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పరీక్షకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది, వ్యక్తులు గానీ ఉండకుండా చూడాలని, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా సమర్ధవంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు సిబ్బందిని ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా పరీక్ష జరిగే కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు చేపట్టామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, పరీక్షా కేంద్రాల దగ్గరలో జిరాక్స్/ ప్రింటింగ్ సెంటర్లు ముగించివేసామని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని, జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్లు మరియు ప్రతి సర్కిల్ పరిధిలో ప్రశ్నపత్రాల తరలింపు, సమాధాన పత్రాలు డిపాజిట్ చెయ్యడానికి తగిన ఎస్కార్ట్ ను నియమించామని, కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామని, పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరగడానికి పోలీస్ శాఖ తరఫు నుండి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని, విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు విద్యార్థులు పాల్పడిన, అలాంటి వారికి ఎవరైనా సహకరించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి తెలిపారు.జిల్లా వ్యాప్తంగా ఎదైనా పరీక్షా కేంద్రం వద్ద ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9154987020,9154980852 కు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు.










