
మారుమూల గ్రామాలకు నూతన రోడ్లు
- మరో 2 నెలల్లో ఇంటింటికి తాగునీటి కొళాయిలు
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
- రూ.5.5 కోట్లతో నిర్మించిన రహదారులు ప్రారంభం
ప్రజాశక్తి - ప్యాపిలి
డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం కొత్త రోడ్లు వేయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మరో రెండు నెలల్లో ప్యాపిలి మండలంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి తాగునీరు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ప్యాపిలి మండలంలో రూ.5.5 కోట్లతో నిర్మించిన నూతన రహదారులను మంత్రి మంగళవారం ప్రారంభించారు. గార్లదిన్నె నుంచి అలేబాదు వరకు రూ.3 కోట్లతో 4 కి.మీ మేర కొత్త రోడ్డుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మునిమడుగు నుంచి అలేబాదు తండా వరకు రూ.2.5 కోట్లతో 5 కి.మీ మేర నూతన రహదారిని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాదయాత్ర చేస్తూ ముందుకు సాగారు. గార్లదిన్నె, మునిమడుగు, అలేబాదు, అలేబాదు తండా ప్రజలతో కలిసి పాదయాత్రగా వెళ్తూ ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగు నీటి సమస్య త్వరలోనే తొలగిపోతుందని మంత్రి భరోసా ఇచ్చారు. వర్షం వచ్చినా రాకున్నా ఇబ్బంది కలగని విధంగా డిసెంబర్కల్లా పైప్లైన్ ద్వారా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి ప్యాపిలి మండలంలో ఇంటింటికి పుష్కలంగా తాగునీరు అందిస్తామన్నారు. అలేబాద్ గ్రామంలోని సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పిటిసి బోరెడ్డి శ్రీరామ రెడ్డి, వ్వవసాయ సలహా మండలి చైర్మన్ మెట్టు వెంకటేశ్వరెడ్డి, వైసిపి మండల కన్వీనర్ బోరా మల్లికార్జున రెడ్డి, భువనేశ్వరరెడ్డి, మాజీ జెడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, ప్యాపిలి సింగిల్ విండో చైర్మన్ బోరెడ్డి రాము, అలేబాద్ తండా గ్రామ సర్పంచి పరమేష్ నాయక్, ఎంపిటిసి, సింగిల్ విండో ఛైర్మన్ బాలయ్య, కో ఆపరేటీవ్ సభ్యులు సీమ సుధాకర్ రెడ్డి, పోదొడ్డి కృష్ణమూర్తి, సుబ్బారెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖర్ శర్మ, ఎంపిడిఒ ఫజల్ రెహమాన్, నేరేడుచర్ల వెంకటేష్, బాలు నాయక్, వెంకటేష్ నాయక్, కొలిమి బషీర్ తదితరులు పాల్గొన్నారు.